ఆకట్టుకుంటున్న పెట్ పార్కు
గ్రేటర్లో రూ.60 లక్షలతో నిర్మాణం
త్వరలో ప్రారంభానికి సమాయత్తం
వరంగల్, జూలై 19 : మనుషులకు అత్యంత ఇష్టమైన నేస్తం పెంపుడు కుక్క. కన్నబిడ్డలతో సమానంగా వీటిని పెంచుకుంటారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి, నమ్మకానికి మారుపేరుగా ఉండే శునకాల కోసం గ్రేటర్లో విన్నూతంగా పెట్పార్కు సిద్ధమవుతోంది. రూ.60లక్షలతో పచ్చని మొక్కలు, అందమైన పరిసరాలతో ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దడంతో పాటు అవి ఆడుకునేందుకు వస్తువులను ఏర్పాటుచేయగా, త్వరలో ప్రారంభం కానుంది.
హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఏర్పాటుచేసిన పెట్ పార్కును హైటెక్ హంగులతో తీర్చిది ద్దారు. పెంపుడు కుక్కల ఆటవిడుపు కోసం అన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేశారు. జంపింగ్ జోన్, పరుగోళా,వాకింగ్ బార్, జూలా లాంటి వివిధ రకాల ఆటవస్తువులు ఇందులో ఉన్నా యి. అలాగే ప్రత్యేకంగా నీటికొలను ఏర్పాటు చేశారు. అంతేగాక వాటిని తీసుకొచ్చే యజమానులు, పిల్లల కోసం సదుపాయాలు కల్పించారు. వీరి కోసం వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, ఓపెన్ జిమ్, మరుగుదొడ్లు నిర్మించారు. గడ్డి తిని అనారోగ్యానికి గురికాకుండా ప్రత్యేకంగా ప్లాస్టిక్ గడ్డి(టర్ఫ్) వేయగా పచ్చదనంతో సర్వాంగసుందరంగా కనిపిస్తోంది. పార్కు ముందుభాగంలో ఫీడింగ్ షాపు ఉండేలా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ రాజేంద్రనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో తొలి పెట్పార్కు ఉండగా ఇది రెండో పార్కుగా నిలిచింది.
20వేల పెంపుడు కుక్కలు
గ్రేటర్ పరిధిలో సుమారు 20వేల పెంపుడు కుక్కలు ఉన్నట్లు అంచనా. ముఖ్యం గా హన్మకొండ ప్రాంతంలో ఎక్కు వగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో వాకింగ్ కోసం వందలాది మంది పెంపుడు కుక్కలను తీసుకొని రోడ్లపైకి వస్తుంటారు. దీంతో పెంపుడు కుక్కల కోసం ప్రత్యేకంగా పార్కును ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇటీవల బదిలీపై వెళ్లిన కమిషనర్ పమేలా సత్పతి దీనిని అభివృద్ధి చేశారు. రకరకాల పెంపుడు కుక్కలు త్వరలోనే పెట్ పార్కులో సందడి చేయనున్నాయి.