ఎమ్మెల్యేలతో మామునూరుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
టీఆర్ఎస్ సభ నిర్వహణపై చర్చ
వరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణ కోసం అనువైన స్థలాన్ని గుర్తించేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. వరంగల్ మహా నగరంలో ప్రతిపాదిత స్థలాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ వేదికగా నవంబర్ 15న పార్టీ ద్వి దశాబ్ది విజయ గర్జన సభ నిర్వహించనున్నట్లు ఈ నెల 13న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సభ నిర్వహణకు అనువైన సువిశాలమైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. వర్ధన్నపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి వరంగల్-ఖమ్మం హైవేపై ఉన్న మామునూరు సందర్శించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సువిశాల స్థలాన్ని పరిశీలించారు.
నగర శివారులో హైవే పక్కన ఉన్నందున టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు బహిరంగ సభకు వచ్చి వెళ్లేందుకు సులువుగా ఉంటుందని, ట్రాఫిక్ సమస్య కూడా ఉండదని భావించారు. ఈ స్థలంలో సభ నిర్వహిస్తే బాగుంటుందని ప్రతిపాదనను ముఖ్య నేతలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత స్థలం విజయగర్జన సభ నిర్వహణ, పార్కింగ్కు అనువుగా ఉంటుందా?, సభకు హాజరయ్యే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు సరిపోతుందా? అనే అంశాలపై మంత్రి స్థానిక పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. మహా నగరంలో ఇంకా ఏమైనా అనువైన స్థలాలు ఉన్నాయా? అనే విషయమై కూడా పరిశీలిస్తున్నట్లు దయాకర్రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి ఇరవై ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రజలను ఉద్దేశించి ఇన్నేండ్లలో పార్టీ సాధించిన విజయాలను, టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అద్భుత ప్రగతిని నివేదిస్తారని మంత్రి తెలిపారు. ఖిలావరంగల్లో ఉన్న స్థలాన్ని కూడా పరిశీలించాలనే ప్రతిపాదనపైనా టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పార్టీ శ్రేణుల ద్వారా ఖిలావరంగల్లోని ఉన్న స్థలంపై ఆరా తీసినట్లు సమాచారం.