ఈ ఏడాది మూడు జిల్లాల్లోని పది మండలాల్లో అమలు
600 యూనిట్ల కేటాయింపు, విలువ రూ.12 కోట్లు
ఒక్కో యూనిట్ రూ.2 లక్షలు, సబ్సిడీ 70శాతం
ప్రతి లబ్ధిదారుకు రెండు గేదెల పంపిణీ
అర్హుల ఎంపికకు అధికారుల కసరత్తు
ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు
వరంగల్ రూరల్, జూలై16 (నమస్తే తెలంగాణ): ఎస్సీలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రత్యేక సాధికారత’ ద్వారా ఒక్కో కుటుంబానికి రెండు పాడి గేదెలు అందించి వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. యూనిట్ విలువ రూ.2 లక్షలు కాగా, ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 70 శాతం, బ్యాంకు రుణం 30 శాతం ఉంటుంది. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది అమలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సర్కారు 600యూనిట్లు కేటాయించింది.
ప్రత్యేక సాధికారత కార్యక్రమం ద్వారా ఎస్సీలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రెండు పాడిగేదెలు అందించి, వారికి అండగా ఉండాలని భావిస్తున్నది. ఒక్కో యూనిట్ విలువ రూ.2 లక్షలు కాగా, 70 శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంకు రుణమని స్పష్టం చేసింది. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీంతో అధికారులు అర్హులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఎస్సీలకు ప్రభుత్వం 60శాతం సబ్సిడీపై మినీ డెయిరీ యూనిట్లను అందజేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సాధికారత కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచి ఎస్సీ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించి, మండలాల వారీగా పాడి గేదెల యూనిట్లను కేటాయించింది. ఈ లెక్కన వరంగల్ ఉమ్మడిజిల్లాలో పది మండలాలకు 600 యూనిట్లు కేటాయించినట్లు ప్రకటించింది. వీటి మొత్తం విలువ రూ.12కోట్లు. ఇందులో 70శాతం సబ్సిడీ అంటే రూ.8.40 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వనుంది. మిగతా 30శాతం రూ.3.60 కోట్లు బ్యాంకర్లు రుణం కింద సమకూర్చుతారు. జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒకటి వర్ధన్నపేట. రెండోది స్టేషన్ఘన్పూర్. ఇవి మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు 200, వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు, హసన్పర్తి మండలాలకు200, ధర్మసాగర్, వేలేరు మండలాలకు 100, జనగామ జిల్లాలోని నాలుగు మండలాలకు 100యూనిట్లు కేటాయి స్తూ ప్రభుత్వం కొన్నిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు
ప్రత్యేక సాధికారత కార్యక్రమం ద్వారా కేటాయించిన యూనిట్ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఎస్సీ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఐకేపీ అధికారులు, బ్యాంకర్లతో మండల కమిటీ వేసి, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎస్సీల్లో 20గుంటల భూమి ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తారు. 20 గుంటల భూమి లేని ఎస్సీ కుటుంబాలు సైతం ఈ కార్యక్రమం ద్వారా యూనిట్లను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం విశేషం. ఎంపికైన లబ్ధిదారులతో గ్రా మాల వారీగా పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి గేదెల సంరక్షణ, పాలు పితకడం, ఇతర అంశాలపై లబ్ధిదారులకు పశుసంవర్థకశాఖ అధికారులు శిక్షణ ఇస్తా రు. అవగాహనతో విజయ డెయిరీ అధికారులు ఈ లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి యూనిట్ మొత్తంలో 30 శా తం రుణం ఇప్పిస్తారు. గేదెలు పంపిణీ చేసిన తర్వాత ల బ్ధిదారుల నుంచి విజయ డెయిరీ పాలు సేకరించనుంది. పాలపై విజయ డెయిరీ బోనస్ ఇవ్వనుంది. ప్రత్యేక సాధికారత కార్యక్రమం ద్వారా యూనిట్ల పంపిణీకి త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వరంగల్ రూరల్ జిల్లా అధికారి సురేశ్ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. ఎంపికైన లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి రూ.2 లక్షల యూనిట్ మంజూరు చేస్తామని, ప్రతి యూనిట్ కింద ఇతర రాష్ర్టాలకు చెందిన రెండు గేదెలను లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. 20మంది లబ్ధిదారులతో ఒక పాల ఉత్పత్తిదారుల సం ఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సురేశ్ వెల్లడించారు.