జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్రెడ్డి
కలెక్టర్ ఆదేశాల మేరకు బాలల వివరాల సేకరణ
నర్సంపేట, జూలై 16: అనాథ పిల్లలకు విద్య, వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సర్వాపురంలో అనా థ పిల్లలు ఉంటున్న ఇంటిని శుక్రవారం ఆయన సందర్శించి వివరాలు సేకరించారు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉంటున్న గడ్డం వెంకటేశ్వర్లు వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన జనగామ జిల్లాకు చెందిన మహిళను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో ఆమె పిల్లలను వదిలేసి తన తల్లిగారింటిలో ఉంటున్నది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందాడు. పిల్లలు వెంకటేశ్వర్లు సోదరి యాకలక్ష్మి వద్ద ఉంటున్నారు. అలాగే, వెంకటేశ్వర్లుకు వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉంది. వీరి దీన స్థితిని తెలుసుకున్న అధికారులు కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి ఇద్దరు పిల్లల వసతి, విద్య కోసం తగిన చర్యలు తీసుకునేందుకు ముందుకొచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పిల్లలు ఉంటున్న ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ పారిజాతం, ప్రొటెక్షన్ అధికారి డీ రాజు, చైల్డ్లైన్ కో ఆర్డినేటర్ ఎల్ వీరబాబు, సోషల్ వర్కర్ జే పద్మలత, టీం మెంబర్ రమేశ్, అంగన్వాడీ టీచర్లు సునీత, శిరీష పాల్గొన్నారు.