ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు
అభివృద్ధి పనుల్లో వేగం
పర్యవేక్షిస్తున్న అధికారులు
నెక్కొండ, జూలై 14: జిల్లాలోని గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. పల్లెప్రగతి నిరంతర ప్రక్రియ కావడంతో అధికారులు పల్లెల్లో పారిశుధ్య పనులను నిత్యం పరిశీలిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగా నెక్కొండలో విజిలెన్స్ అధికారి పద్మనాభరెడ్డి బుధవారం పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించి సర్పంచ్ సొంటిరెడ్డి యమునకు సూచనలు చేశారు. ఆయన వెంట ఉపసర్పంచ్ డీ వీరభద్రయ్య, కార్యదర్శి గోవిందరాజు ఉన్నారు.
వర్ధన్నపేట: వర్షాకాలం ప్రారంభం కావడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో హరితహారం, పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రజాప్రతినిధులు జీపీ పారిశుధ్య సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణం
రాయపర్తి: పల్లెప్రగతి వనాలతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం లభిస్తుందని ఎంపీవో తుల రామ్మోహన్ అన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం మండలకేంద్రం శివారులోని ప్రభుత్వ సీలింగ్ భూములను సర్పంచ్ గారె నర్సయ్య, గిర్దావర్ మల్లయ్యతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో మెగా విలేజ్ పార్కు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ముంకుందారెడ్డి కంచెలో 10 ఎకరాల సీలింగ్ భూమిని బృహత్ పల్లెప్రకృతి వనం నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి అప్పగిస్తూ కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్కు ఒప్పంద పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఈసీ సాంబశివరావు, టెక్నికల్ అసిస్టెంట్ యాకూబ్, కారోబార్ కే రాంచంద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేగంగా పూర్తి చేయాలి
రాయపర్తి: వైకుంఠధామాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని పంచాయతీ పాలకవర్గాలకు జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్ సూచించారు. రాయపర్తి, మైలారంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాల పనులను ఆయన పరిశీలించారు. సర్పంచ్లు గారె నర్సయ్య, లేతాకుల సుమతి యాదవరెడ్డి, కారోబార్ జీ ఉప్పలయ్య పాల్గొన్నారు.