జడ్పీ సీఈవో రాజారావు
నెక్కొండ తండాలో పల్లెప్రగతి పనుల పరిశీలన
కార్యదర్శి నిర్లక్ష్యంపై ఆగ్రహం
నెక్కొండ, ఆగస్టు 5: గ్రామాల్లో నిర్మించిన డంపింగ్ యార్డుల్లో విధిగా నాడెం కంపోస్టు ఎరువు తయారు చేయాలని జడ్పీ సీఈవో రాజారావు సూచించారు. మండలంలోని నెక్కొండ తండా గ్రామ పంచాయతీలో గురువారం ఆయన పల్లెప్రగతి పనులను ఎంపీడీవో సాహితీమిత్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్యార్డును పరిశీలించిన సీఈవో తడి, పొడి చెత్త సేకరణ, నాడెం కంపోస్టు ఎరువు తయారీ విధానంపై కార్యదర్శి ఆనంద్ను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. ఎరువు తయారీపై కార్యదర్శికి అవగాహన లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి, చెత్త సేకరించే జీపీ సిబ్బందికి అవగాహన ఉంటేనే డంపింగ్ యార్డుల్లో కంపోస్టు ఎరువు తయారవుతుందని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణపై కార్యదర్శులు, జీపీ సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో వెలువడే చెత్తాచెదారాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం డంపింగ్ యార్డుల్లో నాడెం కంపోస్టు ఎరువు తయారీకి చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.
నిర్లక్ష్యంపై జడ్పీ సీఈవో సీరియస్
డంపింగ్యార్డు రిజిస్టర్ను పరిశీలించిన జడ్పీ సీఈవో.. రిజిస్టర్లోని పేజీలన్నీ ఖాళీగా ఉండడం ఏమిటని, ఈజీఎస్ టీఏ ఏం పని చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుటే ఓ షాపు యజమాని చెత్తను రోడ్డుపై వేస్తుండడాన్ని గమనించిన సీఈవో.. అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించి డబ్బులు వసూలు చేయాలని కార్యదర్శి, సర్పంచ్ గంగమ్మను ఆదేశించారు. పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆయన.. ఓ గ్రామంలోని పార్కులో పెంచుతున్న మొక్కలను చూసి మరో గ్రామ పంచాయతీ పాలకులు ఆ మొక్కలనే కొనుగోలు చేసి పల్లెప్రకృతి వనాల్లో నాటడం సరికాదన్నారు. జీపీ నర్సరీలో లభించే మొక్కలు, తాము ఎక్కడ నాటుతున్నామో అదే ప్రాంతానికి అనువైన మొక్కలను నాటాలని సూచించారు. వైకుంఠధామం పనులు అసంపూర్తిగా ఉండడంపై సర్పంచ్ గంగమ్మ, కార్యదర్శిని ప్రశ్నించారు. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ పరిధిలో వరదనీరు ఎక్కడా నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాగా, ఆదర్శ పాఠశాల నుంచి వచ్చే వరద, గ్రామం నుంచి వచ్చే వరద నీటికి అడ్డుగా వైకుంఠధామానికి వెళ్లే రహదారిని ఏర్పాటు చేశారని పలువురు జడ్పీ సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. నీరంతా స్కూల్ ఆవరణలో నిలిచిపోతుండడంతో ప్రహరీ కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. వరదనీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు.
మొక్కలను నాటి సంరక్షించాలి
దుగ్గొండి: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలని డీఎస్వో లక్ష్మీభావన, డీఎం భాస్కర్రావు రైస్ మిల్లుల యజమానులకు సూచించారు. నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలోని ముబారక్, వినాయక మిల్లుల ఆవరణలో యజమానుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వృక్షాలతోనే మానవ మనుగడ సాధ్యమని వారు అన్నారు. ఈ సందర్భంగా నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో డీటీఎస్లు క్రాంతికుమార్, వినోద్, రైస్ మిల్ యజమానులు కోటేశ్వర్రావు, దుబ్బ రమేశ్, జంగ రాజిరెడ్డి, షకీల్, బాపురావు, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట పట్టణంలోని గ్యాస్ గోదాం ఆవరణలో డీఎస్వో లక్ష్మీభావన మొక్కలు నాటారు.
పల్లెప్రగతి పనులను నిరక్ష్యం చేస్తే చర్యలు
పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విజిలెన్స్ అధికారి మాధవి హెచ్చరించారు. దగ్గొండి మండలంలోని కేశవాపురం, లక్ష్మీపురంలో పల్లెప్రగతి పనులను వారు పరిశీలించారు. విలేజ్పార్కులు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను చూసి అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. గ్రామాల్లో పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆమె వెంట సర్పంచ్లు నారాయణరెడ్డి, పాండవుల సురేశ్, కార్యదర్శులు ఉన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీడీవో కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. ఎంపీడీవో కార్యాలయంలో పల్లెప్రగతి, ఈజీఎస్ పనులపై కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కార్యదర్శులకు సూచించారు. హరితహారంలో విరివిగా మొక్కలు నాటించి సంరక్షించాలన్నారు. సమావేశంలో ఎంపీవో శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు.