హన్మకొండ, జూలై 31 : ‘హుజూరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ ఎంపీటీసీల సంఘం తరఫున ఎవరూ పోటీ చేయడం లేదు.. పోటీ చేయాలనుకుంటే అది వారి వ్యక్తిగతం’ అని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్గౌడ్ అన్నారు. శనివారం హరితకాకతీయ హోటల్లో తెలంగాణ ఎంపీటీసీల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తంగడి నగేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకతీతంగా హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పోరాటం చేస్తాము తప్ప.., రాజకీయం చేయడం లేదన్నారు. తమ సంఘంతో సంబంధం లేని వ్యక్తి హుజూరాబాద్ ఎన్నికల్లో ఎంపీటీసీలు పోటీ చేస్తారని ప్రకటించడంపై మండిపడ్డారు. సొంత ప్రయోజనాలు, స్వలాభం, రాజకీయ లబ్ధి కోసం కొందరు మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి మాటలను ఎంపీటీసీలెవరూ పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగానే ఉండేవారని అన్నారు. నిధులు, విధులు, అధికారాల కోసమే తెలంగాణ ఎంపీటీసీల సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తమ సమస్యలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కేటీఆర్, హరీశ్రావుతోపాటు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం ముందు ఇప్పటికే 36డిమాండ్లు ఉంచామని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్న తరుణంలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం ఎంపీటీసీలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే విధంగా అనవసరపు ప్రకటనలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. పోటీ చేస్తామని ప్రకటించిన వాసుదేవరెడ్డికి తమకు ఎలాంటి సంబంధం లేదని కుమార్గౌడ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం కేసీఆర్ మండల పరిషత్, జిల్లా పరిషత్లకు రూ.500కోట్లు కేటాయించడంతో పాటు ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం 30శాతం పెంచడం హర్షణీయమన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ముఖ్యమని అన్నారు.
రాష్ట్రంలోని 5,817 మంది ఎంపీటీసీలు తలెత్తుకొని తిరిగేలా చేయడం తమ లక్ష్యమన్నారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం తమతో కలిసి వస్తే స్వాగతిస్తామన్నారు. అనవసర ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఎంపీటీసీల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారనే నమ్మకం తమకు ఉందని కుమార్గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె యాకయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దివి రవీందర్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు గండు రామకృష్ణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్రావు, దామెర ఎంపీటీసీ కాగితాల శంకర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అర్షం వరుణ్గాంధీ, ఎంపీటీసీ సూర సుధాకర్, ఎంపీటీసీల ఫోరం మహబూబాబాద్ అధ్యక్షడు బానోత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.