భూపాలపల్లి టౌన్, ఆగస్టు 3: కొన్నేళ్లుగా అధిక దిగుబడి కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. ఫలితంగా భూసారం దెబ్బతింటున్నది. పర్యావరణం సైతం కలుషితమై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ సమస్యలకు పరిష్కారం సేంద్రియ ఎరువులు వాడడమేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ‘మన తెలంగాణ.. మన వ్యవసాయం’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించింది. ఇండ్లలో ఏడాది కాలంగా జమచేసే పశువుల పేడ, చెత్త, ఎండిన ఆకులతో కూడిన పెంటను పొలాల్లో వేయడం వల్ల భూసారం పెరుగుతుందని అవగాహన కల్పిస్తున్నది. దీంతో పాటు కోడి ఎరువు, వ్యవసాయ భూముల్లో జీవాల మంద ఉంచడం వంటి వాటి వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని వేశాలపల్లిలో సేంద్రియ సాగు వైపు రైతులు మొగ్గు చూపుతూ ముందుకు సాగుతున్నారు.
దిగుబడి ఎక్కువే..
పొలాల్లో పశువుల పేడ వేసిన తర్వాత భూమిని కలియదున్నడంతో వాటిలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా తగిన మోతాదులో అంది మొక్కలు బాగా పెరిగి పంట దిగుబడి అధికంగా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైతులు సేంద్రియ ఎరువులు వినియోగిస్తుండగా మరికొంతమంది చెరువుల్లోని పూడిక మట్టిని సైతం తీసుకెళ్లి తమ పొలాల్లో పోసుకుంటున్నారు. నల్లమట్టి నీటిని ఎక్కువగా పీల్చుకుని నేలలో చాలా సమయం వరకు తేమ ఉండి, మొక్కకు నీటి లభ్యత పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది.
నేలకు బలం
సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నేలకు సహజంగా బలం వస్తుంది. ఫలితంగా భూసారానికి మేలు జరుగడంతో పాటు రైతులకు ఎరువుల భారం కూడా తగ్గుతుంది. పంటలు కూడా బాగా పండుతాయి. రసాయన ప్రభావం లేకపోవడం వల్ల ఆరోగ్యానికీ మేలుచేస్తాయి. అందుకే సేంద్రియ ఎరువులనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తుంది.
పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది
రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగం పెంచడం వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. వాతావరణం కలుషితం కాదు. పంటలకు కూడా పోషకాలు అంది అధిక దిగుబడి వస్తుంది. పశువుల కంపోస్టు, వర్మి, పచ్చిరొట్ట, ఇతర సేంద్రియ ఎరువులు వాడాలి. వేశాలపల్లిలో సేంద్రియ సాగుకు బాటలు వేశాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. రైతులందరినీ భాగస్వామ్యం చేసి పర్యావరణాన్ని కాపాడుతాం.
సేంద్రియ ఎరువులే వాడుతా..
ప్రతి సంవత్సరం మా ఇంటి ఆవరణలో ఉన్న పెంటను తీసుకెళ్లి పొలంలో పోసుకుంటాం. దున్నడానికంటే ముందే ఎరువు వేస్తాం. అప్పుడు పంటలు కూడా బాగా పండుతాయి. వాటితో పాటు కోడి ఎరువు, అప్పుడప్పుడు జీవాల మంద భూముల్లో పెట్టిస్తాం. దీని వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. సేంద్రియ ద్రావణాలను తెప్పించుకుని పంటల్లో వాడుతున్నాం.