పాలకుర్తి రూరల్, అక్టోబర్ 12 : సీఎం కేసీఆర్ పాలనలోనే కళలకు పూర్వ వైభవం లభించిందని, కవులు కళాకారులకు సముచిత గౌరవ లభిస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల ఒగ్గు కళాకారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి మహిళలు బోనాలు, ఒగ్గు కళాకారులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ మల్యాల సరిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంను సన్మానించారు. ఈ సందర్భంగామంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గొల్ల, కురరుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గొర్రెలు పంపిణీ చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్లో రూ.10 కోట్లతో గొల్ల, కురుమలకు కమ్యూనిటీ భవనాలను మంజూరు చేశారని తెలిపారు. ఒగ్గు కథ అంటే చుక్క సత్తయ్య, మిద్దె రాములు గుర్తుకు వస్తారని చెప్పారు. ఒగ్గు డోలు విన్యాసాలకు జాతీయ స్థాయిలో గుర్తింపునకు కృషి చేస్తానన్నారు. గొల్ల, కురుమల సమస్యలను సీఎం కేసీఆర్కు వివరిస్తానని, ఫెడరేషన్ ఏర్పాటునకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మాట్లాడుతూ గొల్ల, కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఒగ్గు డోలు కళాకారులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీపీవో రంగాచారి, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, ఉస్తాద్ బీస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత చుక్క చౌదరపల్లి రవికుమార్, కడకంచి పాపయ్య, ధర్మయ్య, తహసీల్దార్ విజయ్భాస్కర్, ఎంపీడీవో ఆశోక్కుమార్, పీఆర్ డీఈ దిలీప్, ఏసీపీ గొల్ల రమేశ్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం రాంబాబు, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు,పాల్గొన్నారు.
వైద్య సేవలను మించిన సాయం లేదు..
దేవరుప్పుల: ప్రవాస భారతీయ వైద్యులుగ్రామాలను దత్తత తీసుకుని ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. దేవరుప్పులలో అమెరికన్ ఫిజీషియన్ అసోసియేషన్ బాధ్యులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆయన పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికాలోని ప్రముఖ అంకాలజిస్ట్ కత్తుల సతీశ్ పాల్గొన్న శిబిరంలో మంత్రి మాట్లాడుతూ దేవరుప్పుల గ్రామాన్ని దత్తత తీసుకుని వైద్యసేవలు అందించడం తనకు గర్వ కారణమన్నారు. జాతీయ దత్తత గ్రామాల చైర్మన్, అంకాలజిస్ట్ సతీశ్ మాట్లాడుతూ గ్రామాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించి, వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గ్లోబల్ టెలీక్లినిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, సర్పంచ్ ఈదునూరి రమాదేవి, ఎంపీటీసీ తోటకూరి రేణుక, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఎంహెచ్వో మహేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.