పోచమ్మమైదాన్, ఆగస్టు 1 : వరంగల్ దేశాయిపేట శివారులోని మద్దల చెరువు కట్ట వివాదం సమసిపోయింది. పంట పొలాలకు ఆధారమైన చెరువు కట్టను కొందరు ధ్వంసం చేశారు. దీంతో ఆందోళన చెందిన రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య ఆదివారం సద్దుమణిగింది. రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశాయిపేటలోని మద్దల కుంట చెరువు వెనుక 52 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూముల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ చెరువు కట్టను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెంపారు. దీంతో చెరువులోని నీళ్లన్నీ ప్రవహించి కిందికి వెళ్లడంతో రైతులు పోసుకున్న నార్లు కొట్టుకుపోయాయి. అలాగే, కొందరి పంట పొలాలు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందారు. చెరువు కట్ట ధ్వంసం చేయడం వల్ల పొలాలకు సాగునీరు కరువైందని, స్థానిక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని కలెక్టర్తో పాటు మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, స్థానిక పోలీసులకు సమాచారం అందించంతో వారు కూడా పరిశీలించి వెళ్లారు. చివరకు అధికారులు అక్కడి పరిస్థితులు తెలుసుకుని ఇరువర్గాలను సమన్వయ పరిచారు. ధ్వంసమైన మద్దల చెరువు కట్టకు మరమ్మతు చేశారు. ఇక నుంచి చెరువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్పష్టం చేశారని రైతులు ఈ సందర్భంగా వివరించారు. దీంతో చెరువు ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.