గీసుగొండ, సెప్టెంబర్ 17 : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నదని , మౌలిక సదుపాయాలు బాగున్నాయని కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ చైర్మన్ సాబూజాకబ్ అన్నారు. శుక్రవారం ప్రత్యేక హెలీకాప్టర్లో కుటుంబసమేతంగా ఆయన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట గ్రామంలోని టెక్స్టైల్ పార్కును సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో కలిసి తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం, నీటివసతి, తదితర వివరాలను టీఎస్ఐఐసీ అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. పార్కులో అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా సాబూజాకబ్ మాట్లాడుతూ.. కేరళ కేంద్రంగా నడుస్తున్న తమ కంపెనీ టెక్స్టైల్ పార్కులో రూ.వేయి కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రత్యేక్షంగా 2వేల మందికి, పరోక్షంగా మరో 2వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రీయల్ పాలసీ బాగుందని కితాబిచ్చారు. పరిశ్రమలకు సులువుగా అనుమతులు, ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో తాము తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, జోనల్ మేనేజర్ రతన్రాథోడ్, జనరల్ మేనేజర్ వినోద్కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సంతోష్కుమార్, వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, ఆర్ఐ అర్జున్ పాల్గొన్నారు.
పత్తిసాగులో టెక్నాలజీ అవసరం
పత్తిసాగులో అమెరికా టెక్నాలజీని ఇక్కడి రైతులకు పరిచయం చేస్తామని కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ చైర్మన్ సాబూజాకబ్ అన్నారు. ఊకల్ గ్రామంలో ఆయన జేడీఏ ఉషాదయాళ్తో కలిసి పత్తిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా సాబూజాకబ్ మాట్లాడుతూ.. రైతులు పత్తిసాగులో యంత్రాలను ఉపయోగిస్తే లాభం చేకూరుతుందన్నారు. కేరళ రాష్ట్రంలో యాంత్రిక విధానంలో పత్తి పంట సాగు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. ఒకేసారి విత్తనాలు వేసి, ఒకేసారి పత్తిని తీసుకునేలా సాగులో మెళకువలు నేర్పిస్తామన్నారు. ఇక్కడి భూ ములు వాతావారణం, నీటి సౌకర్యం బాగున్నాయన్నారు. కాగా, వరంగల్, హన్మకొండ జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ సాబూజాకబ్కు వివరించగా, ఈ జిల్లాల్లో పండించే పత్తి తమ కంపెనీకే సరిపోదన్నారు. నూతన పద్ధతిలో వ్యవసాయం చేస్తే దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులతో గ్రూపులు ఏర్పాటు చేస్తే, వారికి తమ కంపెనీ ప్రతినిధులు శిక్షణ ఇప్పిస్తామని జేడీఏకు సూచించారు.