పోచమ్మమైదాన్, అక్టోబర్ 18: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ శంకరమఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శంకరమఠంలో మనగుడి ప్రచార బ్యానర్ను డాక్టర్ పోలా నటరాజ్, టీటీడీ ఇన్చార్జి శ్రీనివాసులు, ప్రోగ్రాం ఇన్చార్జి కృష్ణమూర్తి, శంకరమఠం ధర్మాధికారి సంగమేశ్వర జోషి ఆదివారం ఆవిష్కరించారు. 13న లలితా సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమం, 14న కుంకుమ పూజ, ఉపన్యాసం, 15న లలితా సహస్రంతోపాటు కుంకుమపూజ, ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయని వారు వివరించారు. ఉపన్యాసకులుగా వంగల సోమయాజులు, అన్నావజ్జుల సోమశేఖర శర్మ వ్యవహరిస్తారని తెలిపారు.
మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/నర్సంపేట/కాశీబుగ్గ/పర్వతగిరి/పోచమ్మమైదాన్/రాయపర్తి: నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి, ద్వారకపేట, మాదన్నపేట, లక్నేపల్లి బిట్స్ కళాశాల, ముత్తోజిపేటలో దుర్గామాత ఆదివారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నారావుపేటలో భ్రమరాంబికాదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజలు జరిపించారు. నర్సంపేటలో అమ్మవారికి శాకంబరీ అలంకరణ చేయగా, కుష్మాండ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ 19వ డివిజన్ దయానంద్కాలనీ సమీపంలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. ఆలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డులో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వరంగల్ 12వ డివిజన్ డాక్టర్స్కాలనీలోని లక్ష్మీగణపతి ఆలయంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.