గీసుగొండ, సెప్టెంబర్ 24: జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. శుక్రవారం ఆయన గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి ప్రజలు కరోనా టీకాలు వేసుకోవాలని సూచించారు. వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆదేశించారు. 30 ఏళ్లు పైబడిన వారు స్కానింగ్ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసిందన్నారు. ప్రజలు టీకాలపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం వెంకటరమణను పీహెచ్సీ వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెవో గోపాల్, వైద్యాధికారి మాధవీలత, సూపర్వైజర్ కిరణ్కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు.
లక్ష్యం దిశగా అడుగులు
కరీమాబాద్: తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ 40వ డివిజన్లోని పలు కాలనీలు నూరుశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకోగా, మరికొన్ని చేరువలో ఉన్నాయి. కురుమవాడ, వల్లభాయ్పటేల్ వీధిలో వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో కార్పొరేటర్ మరుపల్ల రవి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. 41వ డివిజన్లోని విశ్వనాథకాలనీలోనూ నూరుశాతం పూర్తి కాగా, కార్పొరేటర్ పోశాల పద్మ చేతులమీదుగా సర్టిఫికెట్ అందజేశారు. త్వరలోనే ఆయా డివిజన్లలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 39వ డివిజన్లో కార్పొరేటర్ సిద్ధం రాజు వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ప్రజలు టీకాలు వేసుకోవాలని కోరారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నర్సంపేటరూరల్/నర్సంపేట/ఖానాపురం/నల్లబెల్లి/ఖిలావరంగల్: నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం చిన్న గురిజాలలో వైద్య సిబ్బంది వంద మందికి టీకాలు వేశారు. సర్పంచ్ గడ్డం సుజాత, చెన్నారావుపేట మెడికల్ ఆఫీసర్ ఉషారాణి పర్యవేక్షించారు. నర్సంపేట పట్టణంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ తెలిపారు. ఆయన కరోనా టీకా కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఖానాపురం మండలం నాజీతండాలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ను ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే టీకాలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి మల్యాల అరుణ్కుమార్, సర్పంచ్ బాలకిషన్, ఉపసర్పంచ్ అనితాశ్రీను ఉన్నారు. నల్లబెల్లి మండలం కొండాపూర్లో మేడపెల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనా టీకా శిబిరం నిర్వహించారు. గ్రామస్తులందరికీ వ్యాక్సిన్ వేశారు. ఎంపీవో కూచన ప్రకాశ్, వైద్యాధికారి శశికుమార్, సర్పంచ్ గూబ తిరుపతమ్మ-రాజు, కార్యదర్శి రజిత పాల్గొన్నారు. ఖిలావరంగల్ పరిధిలోని 37వ డివిజన్లో కార్పొరేటర్ బోగి సువర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా తూర్పుకోటలో వందశాతం పూర్తయిన కాలనీల్లో శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, టీఆర్ఎస్ నాయకులు కందిమల్ల మహేశ్, బిల్ల హరినాథ్, ఆర్పీలు రాజమణి, కవిత పాల్గొన్నారు.