కాశీబుగ్గ, జూలై 29 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో సుమారు 125మంది దడువాయి కార్మికులు పని చేస్తున్నారు. రైతులు తీసుకొచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు వీరు కాంటాలు నిర్వహించి, బస్తాకు రూ.4.20 చొప్పున అడ్తి వ్యాపారుల నుంచి తీసుకుంటారు. ఆ డబ్బులను ఒక దడువాయి ప్రతి నెల ఒకటో తేదీన నుంచి అడ్తి వ్యాపారుల దగ్గర వసూలు చేసి బ్యాంకులో జమ చేస్తారు. ఆ తరువాత యూనియన్ ఆధ్వర్యంలో లెక్కలు చేసుకొని ప్రతినెల వేతనాలు పంచుకుంటారు. కాగా, ప్రస్తుతం దడువాయి నంబర్ 22 గంథం పరమేశ్ మార్చి నెలలో అడ్తి వ్యాపారుల దగ్గర వసూలు చేసిన రూ.6 లక్షలను యూనియన్ నాయకులతోపాటు తన సొంతానికి వాడుకుని పారిపోయాడు. తోటి దడువాయిలు లెక్కలను పరిశీలించగా ఈ విషయం బయట పడింది. వెంటనే వారు ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వారిని పిలిపించి మందలించారు. డబ్బులు వాడుకున్న పరమేశ్పై తోటి దడువాయిలు ఒత్తిడి తేవడంతో రూ.2.40లక్షలు బ్యాంకులో జమ చేశాడు.
మిగతా డబ్బులు కట్టడంలో కాలయాపన చేస్తుండడంతో పరమేశ్తోపాటు అతడికి జమానతుగా ఉన్న పస్తం నర్సింగం, వాసం సంజీవ్, దూపం క్రాంతికుమార్, సాయి కిరణ్కు కొన్ని రోజులు వారి డ్యూటీలు, వేతనాలు నిలిపివేశారు. దీంతో జమానతుగా ఉన్న నలుగురు తమ వేతనాలు తమకు ఇప్పించాలని గురువారం మార్కెట్ ప్రదాన కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమ వేతనాన్ని పరమేశ్వర్ వాడుకున్న డబ్బుల కింద జమ చేసినట్లు తెలిపారు. యూనియన్ నాయకులను అడగగా మీ వేతనం జమ చేయడంతోపాటు వచ్చే నెల నుంచి డ్యూటీలు వేస్తామన్నారని చెప్పారు. గతంలో ఇలాగే మూడుసార్లు యూనియన్ నాయకులు రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. పరమేశ్ డబ్బులు వాడుకుంటే జమనతుగా ఉన్న తమ వేతనాలు ఆపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో బయట పని దొరకక, ఇక్కడ నెలవారీ వేతనం ఇవ్వక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్రాహుల్కు, దడువాయి యూనియన్ నాయకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.