సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. వరంగల్ను హెల్త్ హబ్గా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లతో దేశంలోనే అతి పెద్ద సర్కారు దవాఖాన నిర్మాణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మొత్తం 24 అంతస్తుల్లో 2వేల పడకల సామర్థ్యంతో ఉండే పెద్దాస్పత్రి 35 విభాగాల్లో వైద్య సేవలందించనున్నది. గతేడాది సీఎం కేసీఆర్ భూమిపూజ చేయగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో పనుల్లో వేగం పుంజుకున్నది. ఇప్పటికే పునాది వేయడం పూర్తికాగా, మరో వారం రోజుల్లో స్లాబ్ పనులు మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతున్నది. కార్పొరేట్ హంగులు, సదుపాయాలే గాక పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ దవాఖాన.. గుండె, కాలేయం మార్పిడి ఆపరేషన్లతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు అందించనున్నది.
వరంగల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రక నగరం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం వేగంగా జరుగుతున్నది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో నిర్మిస్తున్నది. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాయి సేవలను కొత్త హాస్పిటల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ 2021 జూన్ 21న భూమిపూజ చేశారు. రూ.1100 కోట్లతో 24 అంతస్తులతో అత్యాధునిక హంగులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు త్వరలోనే వేగం పుంజుకుంటున్నాయి.
పునాదులు నిర్మాణం మొత్తం పూర్తయ్యింది. మరో వారం రోజుల్లో స్లాబ్ కోసం పనులు మొదలవుతాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా నిరంతరం పనులు జరుగుతున్నాయి. అన్ని రకాల వైద్య సేవలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో కొత్త హాస్పిటల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. వైద్య సేవలకు సంబంధించిన 35 విభాగాలు, వీటిలో 77యూనిట్లు ఉంటాయి. దాదాపు అన్ని రకాల వైద్య సేవల విభాగాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న విశాలమైన భవనంలో రెండు వేల పడకలను ఏర్పాటు చేస్తారు. 500మంది డాక్టర్లు, వెయ్యి మంది నర్సులు, పారామెడికల్తో పాటు ఇతర సిబ్బంది మరో వెయ్యి మంది పనిచేయనున్నారు.
మొత్తం పది రకాల పది సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటుచేసేలా నిర్మాణం కొనసాగుతున్నది. ఐదు అంతస్తుల్లో ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటుచేస్తారు. అన్ని బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అవయవాల మార్పిడి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తారు. అలాగే ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, సర్జికల్, మెడికల్, ఐసీయూ విభాగాలు ప్రత్యేకంగా ఉంటాయి. శస్త్ర చికిత్సలు, అత్యవసర సేవల కోసం సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్ ఏర్పాటుచేస్తారు. హాస్పిటల్లోని దుస్తులను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేసేందుకు వీలుగా సెంట్రల్ మెకానికల్ లాండ్రీ వసతి కోసం నిర్మాణంలో ప్రత్యేకంగా ప్లానింగ్ ఉన్నది. రోగులకు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆహార అవసరాల కోసం సెంట్రల్ కిచెన్ ఉంటుంది.
డిపార్టుమెంట్లు ఏముంటాయంటే..
మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పీడీయాట్రిక్స్-పీడీయాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, మెడికల్/సర్జికల్/రేడియేషన్ ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెమటాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఇమ్యూనాలజీ/ఎలర్జీ, ఎండోక్రైనాలజీ, సర్జికల్ ఎండోక్రైనాలజీ, ఆర్థో/ట్రామా, ట్రాన్సపరెంట్ వింగ్, గెరియాట్రిక్ మెడిసిన్, అనస్తీషియా, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫుజియన్ మెడిసిన్, వస్కులర్ సర్జరీ, డెంటల్-మాక్సిలోఫేషియల్ సర్జరీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లు మల్టీ సూపర్ స్పెషాలిటీలో ఉంటాయి.
పర్యావరణహితంగా..
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని పూర్తి పర్యావరణ హితంగా నిర్మించనున్నారు. అత్యాధునిక, సంక్లిష్టమైన వైద్య సేవలందించే ప్రక్రియలో ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు భవనం మొత్తాన్ని పర్యావరణహితంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించనున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా గార్డెన్ను తీర్చిదిద్దనున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించనున్నారు.
హెల్త్ హబ్గా వరంగల్..
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీ, కంటి దవాఖాన, సెంట్రల్ జైల్ స్థలం కలిపి 200 ఎకరాల వరకు అవుతుందని.. ఆ ప్రాంతాన్ని సమగ్ర ఆరోగ్య సముదాయం(ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంప్లెక్స్)గా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. వరంగల్ నగరాన్ని సమగ్ర ఆరోగ్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఆనుకొని ఉన్న 200 ఎకరాల్లో అన్ని వైద్య సేవలందేలా ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంప్లెక్స్ను రూపొందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో డెంటల్, వెటర్నరీ కళాశాలను గత జూన్లో మంజూరు చేసింది. ప్రస్తుత ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ(ఎంసీహెచ్) కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఒకేసారి 1500మంది మహిళలు వచ్చినా ఇబ్బంది లేకుండా సేవలందించేలా కొత్త భవనం నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లాకు కొత్తగా మరో మెడికల్ కళాశాను మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీ నగరంలోనే ఉన్నా.. సాంకేతికంగా హనుమకొండ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈమేరకు వరంగల్ జిల్లా కోటాలో రాష్ట్ర ప్రభుత్వం మరో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలని తాజా బడ్జెట్లో ప్రకటించింది. అన్ని రకాల వైద్య విద్య, సేవల సదుపాయాలతో వరంగల్ హెల్త్ సిటీగా మారనుంది. వరంగల్ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇక్కడ వైద్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏకైక వైద్య విశ్వవిద్యాలయం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను వరంగల్లోనే ఏర్పాటు చేశారు. అనంతరం యూనివర్సిటీకి కోసం ఐదు ఎకరాల్లో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. యూనివర్సిటీ భవనం పక్కనే ఉన్న పాత సెంట్రల్ జైలు స్థలంలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది.