నర్సంపేట, సెప్టెంబర్ 19: విషజ్వరాలు విజృంబిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ కంటే సీజనల్ వ్యాధులే ప్రజలను ఎక్కువగా భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలను కాపాడుకునేందుకు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీల ద్వారా పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో వైరల్ ఫీవర్, డెంగీ ఎక్కువగా విజృంబిస్తున్నదన్నారు. అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. జీపీ సిబ్బంది పరిసరాల్లో దోమల మందు పిచికారీ చేయాలన్నారు. కాన్ఫరెన్స్లో డీఎంహెచ్వో వెంకటరమణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్దికి కృతజ్ఞతలు
టీఆర్ఎస్ చెన్నారావుపేట నూతన కమిటీ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, బీసీసెల్ గ్రామ అధ్యక్షుడు రాసమల్ల సతీశ్ నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులకు పెద్ది స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, వార్డు సభ్యులు బండి ఉపేందర్, గొడిశాల సురేందర్, నాయకులు కంది కృష్ణచైతన్యరెడ్డి, మహేందర్రెడ్డి, నరేందర్, వీరయ్య, సత్తయ్య పాల్గొన్నారు. అలాగే, మున్నురుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నురుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు దామెరశెట్టి ఉత్తరయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట నాయకులు ప్రసాద్, సూర్యప్రకాశ్, చంద్రమౌళి, రమేశ్, కుమారస్వామి, కృష్ణమూర్తి, సాంబయ్య, ఆనంద్కుమార్, వెంకట్రాంనర్సయ్య, కుమారస్వామి తదితరులు ఉన్నారు.