వినాయక చవితి వేడుకలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో బుధవారం గణేశుడు కొలువుదీరగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు ఈసారి పెద్ద సంఖ్యలో మట్టి గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వగా, పలు చోట్ల వినూత్న రూపాల్లో ప్రతిమలను ప్రతిష్ఠించారు. కాలనీలు, ఆలయాల్లో అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మండపాలను తీర్చిదిద్దడంలో ఉత్సవ కమిటీలు పోటీపడ్డాయి. తొలిరోజు భక్తులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని, ఉండ్రాళ్లు, పులిహోర, పాయసం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం గణనాథుడికి పూజలు చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని గుడివాడ, రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వినాయకులను దర్శించుకున్నారు. పరకాలలోని భవానీ కుంకుమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ దంపతులు మట్టి గణపతిని ప్రతిష్ఠించి, లంబోదరుడిని కొలిచారు. మరిపెడ మండలం ఎల్లంపేటలో గణేశుడికి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పూజలు చేశారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పూజలు చేయగా, వర్ధన్నపేటలోని వినాయక మండపాల్లో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 1