గీసుగొండ, సెప్టెంబర్ 28: భారీ వర్షాలకు లోలెవల్ వంతెనల పైనుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు ప్రజలెవరూ వెళ్లొద్దని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మంగళవారం ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులలో కలిసి చంద్రయ్యపల్లి లోలెవల్ వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. కాజ్వేలు, వాగులు వంకలు పొంగిపొర్లినప్పుడు ప్రజలు వరదనీటిలోకి వెళ్లి దాటే ప్రయత్నం చేయొద్దని కోరారు. మనుగొండ నుంచి చంద్రయ్యపల్లికి వెళ్లే రోడ్డు మధ్యలో లోలెవల్ వంతెన ఉందని, వర్షకాలంలో వాగు అధికంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు బయటకు రాలేవని పరిస్థితి ఉందని తెలిపారు. సమస్య పరిష్కారానికి చంద్రయ్యపల్లి లోలెవల్ వంతెనపై బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు రూ. 15 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీవో ప్రభాకర్, సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, సర్పంచ్ స్రవంతి, ఏఈ సుధాకర్ పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’ పనులు పూర్తి చేయాలి
మండలంలో వైకుంఠధామాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని రాంపురం, చంద్రయ్యపల్లిలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్టులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్షించారు. పల్లెప్రగతి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని హరిసింగ్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని సూచించారు. ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరుగడం లేదని ఆయన వారిని మందలించారు. వారం రోజుల్లో పల్లెప్రగతి పనులను పూర్తి చేయాలన్నారు.
రైతులను ఆదుకుంటాం
ఖానాపురం: డీఫ్లోరైడ్ ప్రాజెక్టు వరద నీటితో పంటలు మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. మంగళవారం వారు అశోక్నగర్ శివారులో డీఫ్లోరైడ్ ప్రాజెక్టు వరద నీటితో మునిగిన పంటలతోపాటు లోలెవల్ కల్వర్టును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ డీప్లోరైడ్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండడంతో కట్టకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి ఆదేశాల మేరకు రైతు వేదిక సమీపంలో నీరు బయటకు వెళ్లిపోయేలా కాల్వ తీసినట్లు తెలిపారు. దీంతో నీరంతా పంట పొలాల్లోకి వెళ్లడంతో 50 ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయన్నారు. వ్యవసాయాధికారుల నివేదిక ఆధారంగా రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లెవల్ కల్వర్టు పైనుంచి వరదనీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఉధృతి తగ్గే వరకూ వాహనదారులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. వారి వెంట తాసిల్దార్ సుభాషిణి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, సర్పంచ్ గొర్రె కవిత, ఆర్ఐ ఉపేందర్, రవి, తిరుపతిరెడ్డి, కార్యదర్శి అబేద ఉన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నల్లబెల్లి: గులాబ్ తుఫాన్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదనీటి తాకిడికి చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు సెలవుల్లో వెళ్లకుండా గ్రామాల్లో ఉంటూ పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో మొబైల్ టీంలుగా ఏర్పడి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్యం అందించాలని సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు.