కాజీపేట, జూలై 28 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రైలు హైజాక్ కేసును బుధవారం నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ఉద్యమకారులు ఒక్కొక్కరికి రూ. 3వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. దశాబ్దకాలానికిపైగా కోర్టుల చుట్టూ తిరిగిన ఉద్యమకారులపై ఉన్న రైలు హైజాక్ కేసును న్యాయమూర్తి కొట్టివేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 2011 జూలై లో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలును ఆపినందుకు దాస్యం వినయ్భాస్కర్తో పాటు 17 మంది ఉద్యమకారులపై ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు హైజాక్ కేసు నమోదు చేశారన్నారు. అప్పటి నుంచి కోర్టులో ప్రతి వాయిదా కు హాజరైనట్లు తెలిపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ. 3వేల జరిమానా విధించారన్నారు. జరిమానా చెల్లించడంతో రైలు హైజాక్ కేసును కొట్టివేశారని చెప్పారు.
సీమాంధ్ర పాలకులు నాటి తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారన్నారు. ఉద్యమ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నాయకులు మర్చిపోవడం బాధాకరమన్నారు. నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్ర పరిధిలో ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే కేసులన్నింటినీ ఎత్తివేయించారన్నారు. ఇప్పటికైనా పలు చోట్ల తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న రైల్వే అక్రమ కేసులను బీజేపీ ప్రభుత్వం ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనతో పాటు కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేశ్, బోడ డిన్నా, శిరుమల్ల దశరథం, సుంచు కృష్ణ, యూకూబ్ (సోనీ), వనం రెడ్డి, మహమూద్, సయ్యద్ సర్వర్, ఫజల్, కోల వినోద, ఖైరున్నీసాబేగం, రైమున్నీసాబేగం, శోభారాణి, బీజేపీ నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, రావుల కిషన్ ఉన్నారు.