జనగామ, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతన్నలను ఆదుకుంటున్నది. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అండగా నిలుస్తున్నది. ఇప్పటికే రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు, రైతుబీమా అమలు, ఉచిత విద్యుత్ సరఫరా సహా ఎరువులు, విత్తనాలను అదనులో అందిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి దెబ్బతీసినా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తున్నది.
2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. అప్పు డు జనగామ జిల్లాలో దాదాపు 78వేల మంది రైతులకు లబ్ధి చేకూరితే, తాజాగా రూ.50 వేలలోపు రుణమాఫీతో 23వేల మందికి పైగా చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. రెండో విడుత రుణమాఫీ నిర్ణయంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. కాగా, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఆదేశాలతో సోమవారం నుంచి అన్ని బ్యాంకు శాఖలు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యా యి. ఇప్పటికే 1,51,704 మంది రైతులకు వానకాలం పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5వేల చొప్పున రూ.200 కోట్లకుపైగా నగదు బ్యాంకు ఖాతాల్లో చేరాయి.
స్వరాష్ట్రంలో తీరిన కరంట్ కష్టాలు..
స్వరాష్ట్రంలో రైతాంగానికి కరంటు కష్టాలు తీరాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలపై హర్షం వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సాగు మాని వలసబాట పట్టిన రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. రైతన్నను కష్టాల నుంచి గట్టెక్కించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఎంతో ఆనందంగా ఉంది
నేను లింగాలఘనపురం గ్రామీణ బ్యాంకులో రూ.40వేల పంటరుణం తీసుకున్న. సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనులు ముమ్మరమైన ఈ పరిస్థితుల్లో పెట్టుబడికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆగమవుతున్నా. ఆపదలో రుణమాఫీ ఆదుకుంటున్నది.
-ఎడ్ల వీరస్వామి, రైతు, లింగాలఘనపురం
మాట తప్పని సీఎం కేసీఆర్
ఇది రైతు ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. స్వరాష్ట్రంలో అన్నీ తొలగిపోయాయి. సర్కార్ కరోనా కష్టకాలంలోనూ రైతులను ఆదుకుంటున్నది. రుణమాఫీతో భరోసా కల్పిస్తున్నది. దీంతో అప్పులు లేకుండా పోతాయి. -బూత్కూరు అశోక్రెడ్డి, రైతు, దేవరుప్పుల