ఆత్మకూరు: గ్రామాల్లో విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చౌళ్లపల్లి ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య-రవి అన్నారు. ఆదివారం ఎంపీటీసీ వివాహ వేడుక, పుటిన రోజు సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామాల్లో మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆమె అన్నారు. ఆహ్లాదకర వాతావరణంతో ఆరోగ్యంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూజరి స్వప్న, వార్డు సభ్యులు గుర్రం వేణు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మోరె మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మొక్కలను నాటి సంరక్షించాలి
దామెర: ల్యాదెళ్లలో సర్పంచ్ కే శ్రావణ్య ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని కోరారు. మొక్కలు వృక్షాలుగా ఎదిగినప్పుడే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, వాతావరణ కాలుష్య నివారణకు మొక్కలు దోహదం చేస్తాయని వివరించారు. పశువుల బారిన పడకుండా మొక్కలకు ట్రీగార్డులు, ముళ్లకంచె ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గునిగంటి కవిత, హింగె రమాదేవి, అమ్ముల దేవేందర్ పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ బతికించాలి
గీసుగొండ: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని సర్పంచ్ రాజబోయిన రజిత కోరారు. మండలంలోని శాయంపేటలో తాటి, కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన, అంతర్గత రోడ్ల వెంట మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆలయాల ఆవరణల్లో కొబ్బరి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. స్థానికుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కాగిత భిక్షపతి పాల్గొన్నారు.