ఖిలావరంగల్, సెప్టెంబర్ 20 : అద్భుతమైన శిల్ప సంపద, ప్రాశస్త్యం కలిగిన కాకతీయుల కాలం నాటి ఆలయాలెన్నో కోటలో నేటికీ ఉన్నాయి. అంతేగాక మట్టికోట గర్భంలో దాచుకున్నట్లుగా ఉన్న త్రికూటాలయాల ప్రాశస్త్యం చరిత్ర పాఠాలుగా నిలిచిపోయాయి. శ్రీచక్ర ఆకారంలో శత్రుదుర్భేద్యంగా నిర్మించిన కోట పొరల్లో ఉన్న త్రికూటాలయాలు, సైనిక స్థావరాలు నాటి కాకతీయుల ప్రతిభకు నిదర్శనం. అయితే కాలగర్భంలో కలిసిపోతున్న వీటికి కేంద్ర పురావస్తు శాఖ మెరుగులు దిద్దనుండడంతో పర్యాటకంగా మహర్దశ పట్టనున్నది.
ఓరుగల్లు కోటలోని మెట్టు దర్వాజ(పశ్చిమ ద్వారం) ముస్తాబు కానున్నది. కోట లోపలికి వెళ్లగానే కుడిచేయి వైపు వీరగల్లు విగ్రహంతో పాటు తుపాకీతో కాపలా కాసే సిపాయి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏటా మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. అయితే అసలు రహస్యం ఇక్కడే ఉంది. సిపాయి విగ్రహానికి వెనుక భాగాన రాతితో నిర్మించిన గోడతో పాటు పైకప్పు ఉంది. లోపల ఆలయం ఉంది గానీ అందులోకి ఎలా వెళ్లాలో..? దారి ఎటునుంచి ఉందో ఎవరికీ తెలియదు. కోటపైకి ఎక్కి అక్కడినుంచి అగడ్త వైపు దిగితే అక్కడ కోటగర్భంలో కొన్ని గదులు బయటకు కనిపిస్తున్నాయి. ఇది కూడా సుమారు 20 ఏళ్ల క్రితం గుప్తనిధుల కోసం తవ్వినప్పుడు బయటపడ్డవే.
త్వరలో అందుబాటులోకి..
మట్టికోట మెట్టు దర్వాజ వద్ద కోటగోడలో ఉన్న ఆలయాలను పర్యాటకుల ముందుకు తీసుకొచ్చేందుకు పురావస్తు శాఖ ప్రయత్నం చేస్తున్నది. సమీపంలో అక్కడక్కడ పడి ఉన్న శిల్పాలతో పాటు ఆలయాలను వెలికితీసి మెరుగులు దిద్దేందుకు కేంద్ర పురావస్తు శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా నాలుగు రోజుల నుంచి ఆ శాఖ ఉన్నతాధికారుల బృందం సర్వే చేస్తున్నది. త్వరలోనే పనులు చేపట్టి కాకతీయుల అద్భుత నిర్మాణాలను వీక్షకులకు అందుబాటులో ఉంచేందుకు సమాయత్తవుతోంది.