ఖానాపురం : కురుస్తున్న భారీ వర్షాలకు అశోక్నగర్ శివారులోని ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినందున కట్టకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా అధికారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశించారు. సోమవారం అశోక్నగర్ ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును అధికారులతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ ఇప్పటికే పూర్తిగా నిండిందని మరో రెండు రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో కట్టకు ప్రమాదం పొంచి ఉందని ,అదేవిధంగా సమీపంలోని ఇళ్లలోకి నీరు వస్తున్నదని వెంటనే నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే రైతువేదిక సమీపంలో రిజర్వాయర్కు జేసీబీ యంత్రంతో కాలువ తీసి నీటిని బయటికి తరలించాలని అధికారులకు సూచించారు. తక్షణమే పనులను దగ్గరుండి చేపట్టాల్సిందిగా ఎంపీపీ ప్రకాశ్రావుకు రూ.50వేల నగదును అందజేశారు. అదేవిధంగా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్,ఎంపీపీ ప్రకాశ్రావు, ఆర్డీవో పవన్కుమార్, డీఈ రాంప్రసాద్, తాసీల్దార్ సుభాషిణీ, యాదగిరిరావు, ఉపేందర్రెడ్డి, బండి వెంకన్న, గొరె రవి, సంపత్, రాంబాబు,ఆర్ఐ ఉపేందర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.