వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 12: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని జేడీఏ ఉషాదయాళ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా వరంగల్ స్టేషన్రోడ్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా-గ్రీన్ ఇండియా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ బస్టాండ్, రైల్వేస్టేషన్, సీతారామా కాంప్లెక్స్, గౌరీశంకర్ కాంప్లెక్స్, పింగళి ఇండస్ట్రీస్ ఆవరణల్లో ఉషాదయాళ్తోపాటు ఏడీఏ దమోదర్రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ విజ్ఞాన్ పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, విత్తన, ఎరువుల, పురుగు మందుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు పాటుపడుదాం
ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు అందరం పాటుపడుదామని దుగ్గొండి ఏవో దయాకర్ పిలుపునిచ్చారు. దుగ్గొండిలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏవో, ఏఈవోలు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటి వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ను వాడొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు హన్మంతు, రాజేశ్, విశ్వశాంతి, మధు పాల్గొన్నారు. ఖానాపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏవో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. భావితరాలకు కలుషితం లేదని పర్యావరణాన్ని అందించాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓలు రాజ్కుమార్, సంధ్య, సంతోష్, సొసైటీ సీఈవో ఆంజనేయులు, రాజు, వినయ్, భీమయ్య పాల్గొన్నారు.
నెక్కొండలో ఫర్టిలైజర్స్, మార్కెట్లో ప్లాస్టిక్ పదార్థాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని ఇన్చార్జి ఏవో కర్పూరపు అనిల్కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఫర్టిలైజర్ వ్యాపారి షాపు ఎదుట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు కుండీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మండలకేంద్రంలోని షాపులను సందర్శించి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నెహ్రూ యువకేంద్రం నేతృత్వంలో క్లీన్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ పీ జయకుమారి, నెహ్రూ యువకేంద్రం వలంటీర్లు, అధ్యాపకులు రాజిరెడ్డి, ప్రభాకర్, సోమయ్య, రాజు, రాజేందర్ పాల్గొన్నారు.