వరంగల్ మహా నగరానికి మరో అరుదైన ఘనత దక్కింది. ఇప్పటికే ఆధునిక వసతుల కల్పనలో ముందున్న వరంగల్, స్మార్ట్సిటీలో భాగంగా చేపట్టిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’ పోటీలో టైటిల్ సాధించి అగ్రగామి నగరాల సరసన చేరింది.
ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో దేశవ్యాప్తంగా 107 నగరాలు పోటీపడ్డాయి. వీటిలో ప్రాథమికంగా 25 నగరాలు ఎంపికయ్యాయి. ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్వహణ తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలించి 11 నగరాలను గుర్తించింది. ప్రాథమిక దశలో ఎంపికైన 25 నగరాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఉండగా, తుది పోటీలో ఎంపికైన 11 నగరాల్లో ఒక్క వరంగల్ మాత్రమే చోటు దక్కించుకుని దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మెట్రోపాలిటన్ నగరాలైన కోల్కతా, బెంగళూరు సరసన చేరింది.
‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో విజేతలను అంతర్జాతీయ రవాణా నిపుణులతో కూడిన న్యాయ నిర్ణేతల కమిటీ ఎంపిక చేసింది. నగరంలో అన్ని వర్గాల ప్రజలను సైకిల్ తొక్కేలా ప్రోత్సహించిన తీరు, కల్పించిన వసతులు, ప్రత్యేకంగా వేసిన సైకిల్ ట్రాక్, పార్కు, ప్రచార అంశాలను పరిశీలించిన కమిటీ, వరంగల్ను విజేతగా ఎంపిక చేసింది. ఈ అవార్డును దక్కించుకున్న వరంగల్కు కేంద్ర ప్రభు త్వం కోటి రూపాయల నజరానా అందించింది. కొనసాగింపుగా వరంగల్ నగరంలో సైక్లింగ్ అలవాటును మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు సహకరించే వీలు కలిగింది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ సైకిల్ ట్రాక్ డెవలప్మెంట్(ఐసీటీడీ) వరంగల్ నగరంలో సైకిల్ ట్రాక్ల నిర్మాణం, నిర్వహణపై సలహాలు, సూచనలు అందించనుంది.
సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్ పోటీలో వరంగల్ మహానగరాన్ని విజేతగా నిలిపేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) చేసిన కృషి ఫలించింది. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ట్రాక్లు నిర్మించారు. కాజీపేటలోని ఫాతిమా బ్రిడ్జి నుంచి సుబేదారి వరకు రోడ్డుకు ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ వేశారు. వాయు కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. అన్ని వర్గాల వారిని సైక్లింగ్లో ప్రోత్సహించారు. సైక్లింగ్తో కలిగే ప్రయోజనాలపై కార్పొరేషన్ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు సైక్లింగ్ అలవాటయ్యేలా ర్యాలీలు.. సైక్లింగ్ ఇతివృత్తంగా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పిల్లలకు పతంగుల పోటీలు, మహిళలకు స్లో సైక్లింగ్, రంగోళీ పోటీలు పెట్టారు. ఇలా వివిధ కార్యక్రమాలతో అన్ని వర్గాల వారిని సైకిల్కు దగ్గర చేశారు. సైకిల్ కొనే పరిస్థితి లేని వారికి విరాళం ఇప్పించారు.
సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్లో దేశ వ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన 11 నగరాల జాబితాలో వరంగల్కు చోటు దక్కడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కాలుష్యానికి తావులేకుండా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ వరంగల్ నగరంలో అందమైన రీతిలో సైకిల్ ట్రాక్లు అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. పర్యావరణ హిత హరిత భవితవ్యం లక్ష్యంగా తెలంగాణలోని అన్ని నగరాలు వరంగల్ తరహా సైకిల్ ట్రాక్లు అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్ పోటీలో వరంగల్ టైటిల్ సాధించడం సంతోషంగా ఉం ది. దేశంలో 11 అగ్రగామి నగరాల జాబితాలో వరంగల్కు స్థానం దక్కడం గర్వంగా ఉంది. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. రాబోయే రోజుల్లో వరంగల్ నగరాన్ని స్మార్ట్సిటీ పథకంలో భాగంగా మరింత అభివృద్ధి చేస్తాం. నగరంలో నిర్మిస్తున్న స్మార్ట్సిటీ రహదారులకు ఇరువైపులా సైకిల్ ట్రాక్లు నిర్మిస్తున్నాం.
హన్మకొండ : స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ప్రారంభించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిన 11నగరాల్లో వరంగల్ ఉండడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నివారించేందుకు, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కల్పించేందుకు వరంగల్ నగరంలో అందమైన రీతిలో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగరాభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలిపారు.
సైకిల్ ఫర్ చేంజ్ చాలెం జ్ పోటీలో టైటిల్ సాధించేందుకు కృషి చేసిన స్మార్ట్సిటీ బృందానికి అభినందనలు. దేశంలో ఎంపికైన 11 నగరాల్లో వరంగల్ కూడా ఉండడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వరంగల్ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోవాలి. ము న్ముందు సైక్లింగ్పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందు కు చర్యలు తీసుకుంటాం.
– రాజీవ్గాంధీ హన్మంతు, అర్బన్ జిల్లా కలెక్టర్