వరంగల్రూరల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : మహమ్మారి కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి బాధ్యతను భుజాన వేసుకున్నది. అమ్మానాన్నలను, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లల వివరాలు సేకరిస్తున్నది. అనాథ పిల్లల సంరక్షణ, శరణాలయాల సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సబ్ కమిటీ వేసింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, అనాథ పిల్లల పరిస్థితులపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు అధ్యయనం చేస్తున్నది. అనాథ పిల్లలపై సంక్షేమ శాఖ సర్వేను వేగవంతం చేసింది. అంగన్వాడీ టీచర్లు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. కరోనాతో 2020 మార్చి నుంచి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు, తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడ, ఎవరి సంరక్షణలో ఉంటున్నారు? ఏం చదువుతున్నారు? తర్వాత ఏం చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు? తదితర వివరాలను ప్రభుత్వానికి పంపుతున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సర్వే కొనసాగుతున్నది.
ఇద్దర్నీ కోల్పోయిన వారు 43మంది
కరోనా కారణంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఇప్పటివరకు 43 మంది ఉన్నట్లు గుర్తించారు. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు 747 మంది ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి మినహా ఇతర జిల్లాల్లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలను గుర్తించారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారిలో ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం మేడారం పూజారి పిల్లలు ఉండడం గమనార్హం. వరంగల్ అర్బన్ జిల్లాలో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 301 మంది పిల్లల్లో తండ్రి చనిపోయిన వారు 240, తల్లి చనిపోయిన వారు 61 మంది ఉన్నట్లు వెల్లడించారు. జనగామ జిల్లాలో తల్లి లేదా తండ్రి చనిపోయిన 57 మంది పిల్లల్లో తల్లిని కోల్పోయిన వారు 33, తండ్రి చనిపోయిన వారు 24 మంది ఉన్నట్లు తేల్చారు. వరంగల్ రూరల్ జిల్లాలో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 177 మంది పిల్లల్లో నర్సంపేట మండలం చంద్రయపల్లెలోని రెండు కుటుంబాలకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. ఇలా చాలా కుటుంబాలను కరోనా మహమ్మారి కకావికలం చేసింది.
అండగా సర్కారు
బాధిత పిల్లలకు బాలల సంరక్షణ విభాగం అధికారులు ధైర్యం చెప్పి తక్షణ సాయం కింద పదిహేను రోజులకు సరిపడా 16 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నా రు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు స్పాన్సర్షిప్ కింద నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నారు. ఇప్పటికే జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి మూడు నెలల స్పాన్సర్ షిప్ రూ.6వేల చొప్పున ప్రతి జిల్లాలో అందజేశారు. పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్స్లో చేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ భూమి ఉన్న రైతు కుటుంబాల పిల్లలు ఉంటే వారికి రైతు బీమా ఇప్పించేందుకు, స్థిర చరాస్తులను వారి పేరిట మార్పు చేసేందుకు కృషిచేస్తున్నారు. భూమి లేని కుటుంబాల పిల్లలు ఉంటే వారికి జాతీయ కుటుం బ ప్రయోజన పథకం నుంచి ఆర్థిక సాయం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నం
కరోనాతో తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలను గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నం. బాధిత పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపుతున్నం. తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులు అందిస్తున్నం. తల్లిదండ్రులను కోల్పోయిన వారికి నెలనెలా స్పాన్సర్ షిప్ కింద రూ.2 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లల వివరాలను స్థానిక అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నం