జనగామ, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయనున్న దళితబంధు పథకాన్ని ఆపడం ఎవరితరం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం ఆయన చిలుపూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. దళితబంధు పథకానికి రూ.1200 కోట్లు కేటాయించి అమలులో ఎదురయ్యే ఇబ్బందులు తెలుసుకునేందుకు ఎప్పటిలాగే పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులతో చర్చించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా హుజూరాబాద్లో 20,900 కుటుంబాలను గుర్తించి రూ.20వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దళితుల సంక్షేమ పథకాల అమలులో గతంలో బ్యాంకులతో సంబంధం ఉండేదని, ప్రస్తుతం బ్యాంకర్లు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10లక్షల సాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం సాహసోపేత నిర్ణయమని కడియం అన్నారు.
ఈ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని లబ్ధిదారులు తమకు అనువైన ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఆర్థికంగా నిలబడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితులకు ఇంతటి పథకాలను అందిస్తున్నరా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా దళితబంధుపై విమర్శలు మానుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం లేదని, దళితుల సంక్షేమం కోరేవారు ఈ పథకాన్ని ఆహ్వానించాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఇంతపెద్ద పథకాన్ని అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా కాదని, దేశంలో ఇది పూర్తిస్థాయిలో అమలు చేయడానికి సుమారు 45 ఏళ్లు పట్టొచ్చన్నారు.