హనుమకొండ/శాయంపేట సెప్టెంబర్ 19 : పోషకాహార లోపం చిన్నారుల పాలిట శాపంగా మారింది. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలంటే సంపూర్ణ పౌష్టికాహారం అందించాలి. దీనిపై తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలు ఆరోగ్యంగా పుట్టకపోవడంతో పాటు చాల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకు సర్కారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. పోషణ్ అభియాన్ పేరుతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసం అంతా ప్రత్యేక కార్యాచరణతో అంగన్వాడీ సెంటర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం కూడా ఈ నెల 1నుంచి 30వ తేదీ వరకు పోషణ మాసోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి ప్రారంభించారు.
ఇంటింటా అవగాహన
పోషణ మాసోత్సవంపై అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటికీ టీచర్లు, ఆయాలు తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. మతా శిశు మరణాలు తగ్గించడంతో పాటు చిన్నారులు రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టకుండా ఉండాలంటే గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వివరిస్తారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి రోజూ అవగాహన కార్యక్రమాలతో పాటు ర్యాలీలు నిర్వహిస్తారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్నం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూనే అవగాహన కల్పిస్తున్నారు. పోషణ మాసోత్సవంలో భాగంగా ముందుగా చిన్నారులు వయస్సు, తగిన ఎత్తు, బరువులను గుర్తిస్తారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలల తర్వాత తల్లిపాలతోపాటు అనుబంధ పోషక ఆహారం అందించాలని, బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిపాలు తాగించాలని తల్లులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, ఆరు సంవత్సరాలలోపు చిన్నారులకు కూడా ఏఏ మోతాదులో పోషకాహారం అందించాలనేది కూడా వివరిస్తారు. చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసాహారం గురించి చెబుతారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు బాలామృతం, కోడిగుడ్లు, పాలు పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పాలు, ఐరన్ మాత్రలతో పాటు పోషకాహారం కూడా అందిస్తున్నారు. పోషణలోపం, కౌమారదశ బాలికల్లో రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టే పిల్లలను తగ్గించడం, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిం చి, పోషణ లోపం లేకుండా చూడడమే ఈ మాసోత్సవ లక్ష్యం అని అధికారులు అంటున్నారు.
జిల్లాలో 799 అంగన్వాడీ సెంటర్లు
్రస్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, భీమదేవరపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 799 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 772 మెయిన్, 27 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 7,532 మంది గర్భిణులు, 5,257 మంది బాలింతలు, 54,442 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు.
విజయవంతం చేయాలి
పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని ఐసీడీఎస్ శాయంపేట సూపర్వైజర్ సునీతారెడ్డి అన్నారు. ఈనెల 30 తేదీ వరకు పోషణ్ అభియాన్ను నిర్వహిస్తున్నందున పిల్లలు, తల్లులు, గర్భిణులు అందరు పాల్గొనాలని కోరారు. నాలుగు వారాల పాటు ప్రణాళికాబద్ధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని విరవించారు. పిల్లలు, బాలికలు, తల్లులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి సంపూర్ణ పౌష్టికాహారంతో కలిగే లాభాలను వివరిస్తామన్నారు.
మాసోత్సవ కార్యక్రమాలు
పోషణ లోప నివారణే లక్ష్యం
జిల్లాలో ఏ ఒక్కరు కూడా పోషణ లోపం లేకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాం. పోషణ మాసోత్సవంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గృహ సందర్శన చేసి పోషణ లోపంపై తల్లులకు అవగాహన కల్పిస్తారు. పిల్లల పెరుగుదల, తక్కువ బరువు, రక్తహీనత లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకునేందుకు తల్లులకు వివరిస్తారు. పోషణ లోప నివారణే ఈ మాసోత్సవ లక్ష్యం. నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం.