వెంకటాపూర్, ఆగస్టు 3 :దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టానికి రామప్ప దేవాలయం ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మానుకోట ఎంపీ కవిత, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్రావు, జడ్పీవైస్ చైర్మన్ నాగజ్యోతితో కలిసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పోరాటాల గడ్డ తెలంగాణలో రామప్ప దేవాలయం ఉండడం మన అదృష్టమన్నారు. రామప్పను కట్టించింది కాకతీయ రాజులైతే.., స్వరాష్ట్రంలో రామప్ప శిల్ప సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసింది సీఎం కేసీఆరేనన్నారు.
రామప్పతోపాటు సమాంతర దేవాలయాలను అభివృద్ధి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు. యునెస్కో నిబంధనల మేరకు రామప్ప అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యతగా రూ.250 కోట్లు కేటాయించాలని, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి నిధుల మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు ఎంతో కృషి చేశారని, ముఖ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ విద్యావతి అత్యంత నైపుణ్యంతో గీసిన రామప్ప రేఖా చిత్రాలు యునెస్కో గుర్తింపునకు దోహదపడ్డాయన్నారు. 50 ఏళ్ల క్రితమే సమైక్య పాలకులు పట్టించుకుంటే రామప్ప దేశంలో మరో గొప్ప కట్టడమయ్యేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను పాటిస్తూ రామప్ప అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు. యునెస్కో గుర్తింపు కోసం విశేష కృషి చేసిన కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు, పాపారావు, ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
పర్యాటక పరంగా మరింత అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను పర్యాటకంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 17దేశాల మద్దతుతో రామప్పకు యునెస్కో గుర్తింపు ద్వారా ఘనకీర్తి లభించిందని, ఇందుకోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. రామప్పను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ కోసం పాలంపేట గ్రామస్తులు సహకరించాలని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రామప్ప యునెస్కో గుర్తింపు కోసం మానుకోట మాజీ ఎంపీ సీతారాంనాయక్ పార్లమెంట్లో తన వాణిని వినిపించినట్లు తెలిపారు. ప్రస్తు తం ఆలయ పరిధిలో 27 ఎకరాల స్థలం ఉందని, యునెస్కో నిబంధనల మేరకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చే రీతిలో రామప్పను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యునెస్కో గుర్తింపు ద్వారా రామ ప్ప కీర్తి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు.
అభివృద్ధి చేసుకుంటే ఉపాధి అవకాశాలు – బోయినపల్లి వినోద్కుమార్
మరుగునపడిన చరిత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులోకి తేవడం వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వచ్చిన గుర్తింపును దక్కించుకోవడం మనందరి ప్రధాన కర్తవ్యమన్నారు. రామప్ప అభివృద్ధి కోసం ప్రత్యేక నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రామప్ప నిర్మాణానికి ముఖ్యకారకుడైన రేచర్ల రుద్రుడిని ఆదర్శంగా తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. దేశంలోని ఇతర యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలకంటే దీటుగా రామప్పను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితమే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీపీ బుర్ర రజిత, జడ్పీటీసీ గై రుద్రమదేవి, సర్పంచ్ డోలి రజిత, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మాజీ జడ్పీచైర్మన్ సాంబారి సమ్మారావు, జడ్పీటీసీలు, నాయకులు మల్క రమేశ్, అశోక్ పాల్గొన్నారు.