మహబూబాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది మొట్ల తిమ్మాపురం. ఈ గిరిజన గూడెంలో 120 కుటుంబాలు ఉండగా, 550 మంది జనాభా నివసిస్తున్నారు. ఏడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ గూడెంలో మొదట ఆదివాసీ కుటుంబాలు మాత్రమే ఉండేవి. అనంతరం గ్రామపెద్దల అనుమతితో ఇతర కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. అయినా ఇక్కడ ఆదివాసీ కుటుంబాలదే అగ్రస్థానం. రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గూడెం 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. 2019లో తొలిసారిగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకున్నారు. ప్రజల ఐకమత్యమే ఈ పల్లెకు బలం. ఒకరికి కష్టం వస్తే ఊరంతా అండగా నిలుస్తుంది. గ్రామంలో ఉన్న సమస్యలను కలిసికట్టుగా చర్చించుకొని పరిష్కరించుకుంటారు. వీరి ప్రధాన వృతి వ్యవసాయమే. నాలుగైదు కుటుంబాలు మినహా ఇక్కడి వారందరికీ సాగు భూములు ఉన్నాయి. మారుమూల గిరిజన గ్రామమై నా ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గ్రామంలోని సమస్యలు పరిష్కరించలేదని ఎన్నికలు బహిష్కరించారు. అధికారుల బుజ్జగింపులు, హామీలతో తిరిగి ఓటింగ్లో పాల్గొన్నారు. 2005లోనే ఈ గ్రామం సంపూర్ణ అక్షరాస్యతను సాధించింది. వ్యవసాయం ద్వారా ఆర్థిక వెసులుబాటు లభించడంతో వారి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేసినా, విధులకు గైర్హాజరైనా ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకున్నారు.
పోలీస్స్టేషన్ మెట్లెక్కలే..
మొట్ల తిమ్మాపురం గ్రామంలో 15 ఏళ్ల క్రితం తాగుడుకు బానిసై చాలామంది మృతి చెందారు. పెద్దదిక్కును కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. అప్పుడే గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. అందరూ కలిసికట్టుగా ఊళ్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. మద్యం అమ్మినా, కొన్నా జరిమానా విధిస్తున్నారు. అలా అప్పటినుంచి అమలు చేస్తూ వస్తున్నారు. గ్రామంలో ఎవరి మధ్య అయినా గొడవ జరిగితే ఆదివాసీలంతా గ్రామపెద్ద అయిన పటేల్ దొర సమక్షంలో కూర్చొని పరిష్కరించుకుంటారు. ఊరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బయ్యారం పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పోలీసులు సైతం మొట్ల తిమ్మాపురాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర గ్రామాల్లోని యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
ఐకమత్యంతో గ్రామాభివృద్ధి
అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామంలో ఏ పని చేయాలన్నా అందరం కూర్చొని చర్చించి సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం . ఎన్నికల సమయంలోనూ పోటీ ఉండదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇక్కడ ఆనవాయితీ. పంచాయతీ నిధులతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
గ్రామంలోనే సమస్యలు పరిష్కరించుకుంటం..
గ్రామంలో ఎలాంటి గొడవలు తలెత్తినా పెద్ద మనిషి సమక్షంలో కూర్చొని పరిష్కరించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్స్టేషన్ను ఆశ్రయించం. అన్నదమ్ముల్లా అందరం కలిసిమెలిసి ఉంటాం. గ్రామంలో అందరికీ సాగు భూములు ఉన్నాయి. ఇక్కడ కూలీలు ఉండరు. వ్యవసాయ పనులకు పక్క గ్రామం నుంచి కూలీలను తీసుకొస్తాం.
చైతన్యం కలిగిన ఊరు..
మారుమూల ఏజెన్సీలో ఉన్నప్పటికీ మొట్ల తిమ్మాపురం ప్రజలు ఎంతో చైతన్యవంతంగా, ఒకేమాట మీద ఉంటారు. చదువుపై శ్రద్ధతో చాలామంది యువకులు ఉన్నత చదువులు చదువుతున్నారు. గ్రామం నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదులు రాలేదు. మద్యం అమ్మకాలు ఇక్కడ పూర్తిగా నిషేధం. గ్రామ ప్రజల నుంచి పోలీసులకు సంపూర్ణ సహకారం ఉంటుంది.