వర్ధన్నపేట, ఆగస్టు 3:వృద్ధులను కన్నవారే పట్టించుకోని నేటి రోజుల్లో తన వంతు సహకారం అందిస్తూ వారి కండ్లల్లో వెలుగవుతున్నాడు. ఇంటి వద్దే వైద్య నిపుణులను పిలిపించి కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారిని వరంగల్ నగరానికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తున్నాడు. దీంతోపాటు కేజీబీవీ, జూనియర్ కళాశాలకు రెండెకరాల భూమిని దానమిచ్చాడు. వృద్ధ, అనాథాశ్రమాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వర్ధన్నపేట మండలం ఇల్లందవాసి గుమ్మడవెల్లి ఉపేంద్రశాస్త్రి.
రూ. కోటి విలువ చేసే రెండెకరాల భూమి దానం
ఇల్లంద గ్రామంలోని జాతీయ రహదారి సమీపంలో కేజీబీవీ భవన నిర్మాణం కోసం ఉపేంద్రశాస్త్రి రెండెకరాల తన సొంత భూమిని దానం చేశాడు. ప్రభుత్వం ఆ స్థలంలో పదేళ్ల క్రితం కేజీబీవీ భవనాన్ని నిర్మించడంతోపాటుగా ప్రస్తుతం జూనియర్ కళాశాల భవనాన్ని కూడా నిర్మిస్తున్నది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా 20 గుంటల భూమిని విరాళంగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మల్లికాంబ మనోవికాస కేంద్రం, సహృదయ వృద్ధాశ్రమం, అనాథ పిల్లలు చదువుకుంటున్న వ్యా సాశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశాడు. ఇల్లందలోని రెండు గదుల ఇంటిలోనే నిరాడంబరంగా ఉపేంద్రశాస్త్రి జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ 90 ఏళ్ల వయసున్న ఆయన పేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉందంటున్నాడు.
మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి ఉపేంద్రశాస్త్రి ప్రతి నెలా రెండు సార్లు తన ఇంటి వద్దే వృద్ధులకు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయిస్తున్నాడు. గ్రామాల వారీగా శిబిరానికి ముందు రోజు గ్రామంలో డప్పు చాటింపు వేయిస్తాడు. సాయంత్రం మైకులో చెప్పిస్తాడు. వైద్యులు పరీక్షలు చేయగానే తన సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనంలో వారిని వరంగల్ కంటి దవాఖానకు తీసుకువెళ్లి ఆపరేషన్లు చేయించి క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చుతున్నాడు. అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులను కూడా అందజేస్తున్నాడు. గత 9 సంవత్సరాలుగా రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు మండలాల పరిధిలోని 70 గ్రామాలకు చెందిన 2,650 మంది పేద వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయించాడు.
చేతనైనంత సేవ చేస్తున్నా..
పేదలకు చేతనైనంత సేవ చేస్తున్నా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ముసలితనంలో కండ్లు కనిపించకపోతే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వృద్ధులకు కంటి పరీక్షలు చేయించి ఆపరేషన్లు చేయిస్తున్నా. ఎంత మంది వచ్చినా వారికి పరీక్షలు చేయించి శస్త్రచికిత్సలు చేయించాలని అనుకుంటున్నా. వృద్ధులకు సేవ చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాడని అనుకుంటున్నా.
ఆయన సేవలు మరువలేనివి
ఉప్పయ్యగారి(ఉపేంద్రశాస్త్రి) సేవలు మరువలేనివి. నాకు కండ్లు కనిపించక ఇబ్బంది పడిన. అయ్య గారు మా ఊర్లో చెప్పించడంతో నేను శిబిరంలో పరీక్షలు చేయించుకున్నంక కంటి ఆపరేషన్ చేయింరచిండు. ఇప్పుడు నాకు కండ్లు మంచిగ కనిపిస్తానై. నాలాంటి ఎంతో మంది వృద్ధులకు సేవ చేస్తున్నడు.
పరీక్ష చేయించుకునేందుకు వచ్చిన
కండ్లు సరిగ కనిపిస్తలేవు. మా ఊళ్లె చానా మందికి అయ్యగారు కంటి ఆపరేషన్లు చేయించిండు. నేను కూడా పరీక్షలు చేయించుకోవాల్నని శిబిరానికి వచ్చిన. డాక్టర్ చూసి ఒక కంటికి పొర ఒచ్చిం ది ఆపరేషన్ చేయించుకోవాల్నని చెప్పిండు. అయ్యగారు వరంగల్కు తీసుకపోయి ఆపరేషన్ చేయిస్తానన్నడు. ఆపరేషన్ చేయించుకుంట.