వరంగల్, సెప్టెంబర్ 26(నమస్తేతెలంగాణ) : గతంలో కొందరు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను నాణ్యమైన విద్య లభిస్తుందనే ఆశతో ప్రైవేట్ స్కూళ్లకు పంపారు. ఇలా పలు ప్ర భుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో వంద శాతం మంది ప్రైవేట్ స్కూళ్ల దారి పట్టారు. దీంతో పల్లెలు, పట్టణాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 2016 నుంచి జిల్లాలో సుమారు 105 ప్రభుత్వ స్కూ ళ్లు ఈ కారణంతో మూతపడినట్లు తెలిసింది.
సర్కారు స్కూల్ బాట..
కరోనాతో విద్యావ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు. కరోనాతో మూతపడిన స్కూళ్లు ఈ నెల ఒకటి నుంచి తిరిగి పునఃప్రారంభం కావడంతో ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులు కొందరు ప్రభుత్వ పాఠశాలల బాట పడుతున్నారు. వీరిలో ముఖ్యంగా గతంలో ప్ర భుత్వ స్కూళ్లలో చదివి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఉంటున్నారు. వీరితో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదివి ప్రభుత్వ స్కూళ్లకు చేరుతున్న విద్యార్థులు కూడా ఉంటున్నారు. దీంతో గతంలో విద్యార్థులు లేక మూతపడిన సర్కారు స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో 17 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. వీటిలో చెన్నారావుపేట మండలం హట్యాతండా, నల్లబెల్లి మండలం పోచంపల్లి, వీర్యతండా, చిన్నతండా, నర్సంపేట మండలం జంగాలపల్లితండా, నెక్కొండ మండలం అవుసలతండా, రేకులబోడుతండా, తోపనపల్లి, రాయపర్తి మండలం సూర్యతండా, బంధన్పల్లి, పీక్లతండా, రావులతండా, జేతురామ్తండా, సంగెం మండలం వంజరపల్లి, ఖిలావరంగల్ మండలం ముస్కులపల్లి, వర్ధన్నపేట మండలం చంద్రుతండా, కొండాపురం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
తిరిగి వస్తున్న టీచర్లు..
గతంలో విద్యార్థులు లేక మూతపడిన సర్కారు స్కూళ్లలోని టీచర్లను విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు డిప్యుటేషన్పై పంపారు. ఇప్పుడు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు గుడ్బై చెబుతూ సర్కారు స్కూళ్లకు వస్తుండడంతో డిప్యుటేషన్పై వెళ్లిన టీచర్లు తిరిగి గతంలో తాము పనిచేసిన స్కూళ్లకు వస్తున్నారు. ఉన్నతాధికారులు డిప్యుటేషన్ రద్దు చేసి ప్రస్తు తం తిరిగి తెరుచుకుంటున్న స్కూళ్లకు పంపుతున్నారు. ప్రతి స్కూల్లో ఇద్దరేసి టీచర్లు పనిచేసేవిధంగా చర్య లు తీసుకుంటున్నారు. వంజరపల్లి వంటి స్కూల్కు ముగ్గురు టీచర్లను కేటాయించారు. మిగతా పదహారింటిలో ఎక్కువ స్కూళ్లలో ఇద్దరు ఉపాధ్యాయులు విధు లు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు తెరుచుకున్న పదిహేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 29 మంది టీచ ర్లు పనిచేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దించేందుకు శ్రమిస్తున్నారు. తమ పాఠశాలకు వస్తున్న పదిహేను మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మ ధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లను పంపిణీ చేసినట్లు పో చంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొలిపాక సంగీత చెప్పారు.
ప్రతి స్కూల్కు ఇద్దరు టీచర్లు… – వాసంతి, డీఈవో, వరంగల్
జిల్లాలో గతంలో విద్యార్థులు లేక మూతపడిన ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఇప్పటివరకు పదిహేడు పాఠశాలలు తెరుచుకున్నాయి. మరికొన్ని స్కూళ్లు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరిగి తెరుచుకున్న స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం. వాస్తవంగా స్కూల్లో 30 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలి. కానీ ఒకరు సెలవులో ఉన్నా స్కూల్ పనిచేసేలా 30 మందిలోపు విద్యార్థులు ఉన్నా రెండో టీచర్ను కేటాయిస్తున్నం. ప్రతి స్కూల్లో ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు.