నర్సంపేట, ఆగస్టు 2 : సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని పేదలకు ఎంతో మేలు కలుగుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, బీసీ కులాలకు చెందిన 474మంది లబ్ధిదారులకు రూ.4.74కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, 148మందికి రూ.45లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరంలా మారిందన్నారు. పార్టీలకతీతంగా గ్రామాల్లో అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యమందిస్తున్నదని, ఆరోగ్యశ్రీలో లేని వైద్యానికి కూడా సీఎం కేసీఆర్ డబ్బులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా థర్డ్వేవ్ ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.