కాజీపేట, సెప్టెంబర్ 17: నిరుద్యోగ యువతీయువకులు, విద్యార్థులకు వృతి నైపుణ్యం ఎంతో అవసరమని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 61వ డివిజన్లోని పున్నమి గెస్ట్హౌస్లోని (టాస్క్) తెలంగాణ అకడమిక్ ఫర్ స్కిల్డ్ అండ్ నాలెడ్జ్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. టాస్క్ వరంగల్ శాఖ విస్తరణ, నూతన కోర్సుల ఏర్పాటుపై టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హాతో కలిసి హనుమకొండ జిల్లాలోని పలు విద్యాసంస్థల యాజమాన్యాలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్విప్ మాట్లాడుతూ.. హనుమకొండను ఎడ్యుకేషన్ హబ్, ఎంప్లాయ్మెంట్ హబ్, రెండో ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కేటీఆర్ చేతుల మీదుగా హనుమకొండలో 2016లో టాస్క్ను ప్రారంభించామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చడమే టాస్క్ లక్ష్యమన్నారు. హనుమకొండ టాస్క్ కేంద్రంలో ఇప్పటి వరకు 2,300 మంది శిక్షణ పొంది, 1100 మంది మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని వెల్లడించారు. హనుమకొండకు మరిన్ని కొత్త కంపెనీలు త్వరలోనే రానున్నాయని వివరించారు. హమనుకొండ జిల్లాలో ఫార్మ, ఐటీ, టెక్స్టైల్ రంగాల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్క్ సంస్థలో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో మాస్టర్జీ విద్యాసంస్థల అధిపతి సుందర్రాజ్యాదవ్, కూడా డైరెక్టర్ దొంతి రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు.