వర్ధన్నపేట(సంగెం), జూలై 31: మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనం పనులను వేగవంతం చేయాలని డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు సూచించారు. సంగెం మండలంలోని చింతలపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్తోపాటు తిమ్మాపూర్లో ఏర్పాటు చేస్తున్న మెగాపార్కు పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనాన్ని మరింత పెంచడంతోపాటు వాతావరణ సమతుల్యత కోసం ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లెప్రకృతి వనాన్ని పదెకరాల స్థలంలో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
ప్రారంభమైన పనులు
కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో స్థలాలను ఎంపిక చేసి పనులను కూడా ప్రారంభించామన్నారు. స్థలాల్లో అన్ని రకాల మొక్కలను నాటి రక్షించేందుకు భూములను చదును చేయడం, ఇతర అన్ని వసతులను కూలీల ద్వారా చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే అన్ని రకాల మొక్కలను తెప్పించి పార్కు స్థలాల్లో నాటించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారించాలని కోరారు. అనంతరం చింతలపల్లిలో రహదారి పక్కన నాటిన మొక్కలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏపీవో, ఈజీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
పెద్ద సైజు మొక్కలు నాటాలి
గీసుగొండ: హరితహారంలో భాగంగా రోడ్లకిరువైపులా రెండు వరుసల్లో పెద్ద సైజు మొక్కలు నాటాలని డీఆర్డీవో సంపత్రావు అన్నారు. మండలంలోని మరియపురం, ఊకల్, శాయంపేటను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రెండో వరుస మొక్కలు నాటే విధానాన్ని అధికారులకు వివరించారు. రోడ్లకిరువైపులా ముళ్ల పొదలను తొలగించాలని సూచించారు. గ్రామాల్లో అంతర్గత రోడ్ల వెంట పూలు, పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లకిరువైపులా నాటే మొక్కలకు రైతుల నుంచి అభ్యంతరాలు వస్తాయని సర్పంచ్లు తెలుపగా, రెవెన్యూ అధికారులు, స్థానికులు కలిసి రోడ్లకు బౌండరీలు ఏర్పాటు చేస్తారని, రహదారులకు ఉన్న స్థలాల్లో మొక్కలు నాటాలని డీఆర్డీవో సూచించారు. జీపీ నిధుల నుంచి గ్రీనరీకి వాడుకోవచ్చన్నారు. మెగాపార్కు పనులను ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రవీణ్కుమార్, ఏపీవో మోహన్రావు, మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఊకల్ సర్పంచ్ మొగసాని నాగదేవత, శాయంపేట సర్పంచ్ రజబోయిన రజిత ఉన్నారు.
రెండు వేల మొక్కలు నాటాలి
ఖానాపురం: మండలకేంద్రం నుంచి మంగళవారిపేట వరకు 365 జాతీయ రహదారికి ఇరువైపులా ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా రెండు వేల మొక్కలు నాటించనున్నట్లు ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. ఎంపీడీవో సుమనావాణి, ఎన్హెచ్, ఈజీఎస్ అధికారులతో కలిసి ఎంపీపీ హైవేకు ఇరువైపులా సర్వే చేశారు. మూడు వరుసల్లో మొక్కలు నాటించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఎంపీపీ తెలిపారు. ఆయన వెంట ఏపీవో సునీత, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.