చెన్నారావుపేట, జూలై 29 : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐవోబీ, ఏపీజీవీబీ, డీసీసీబీలో ఉన్న ఎన్పీఏల రికవరీ కోసం బ్యాంకు అధికారులకు డీఆర్డీఏ, వ్యవసాయ శాఖాధికారులు సహకరించాలని కలెక్టర్ ఎం హరిత ఆదేశించారు. ఈ మేరకు ఆమె సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల రుణ టార్గెట్ రూ.420 కోట్లకు గాను రూ.56.27 కోట్లు పూర్తయిందన్నారు. అలాగే, వానకాలానికి సంబంధించి పంట రుణాలకు రూ.791 కోట్లు టార్గెట్ కాగా, జూన్ వరకు రూ.192 కోట్ల రుణాలను వివిధ బ్యాంకుల ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం స్వనిధి కింద తీసుకున్న రుణాలను వెంటనే లబ్ధిదారుల నుంచి రికవరీ చేయించాలని మెప్మా పీడీని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద వచ్చిన 57 దరఖాస్తులను వెంటనే బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం మంజూరు చేయాలని ఎల్డీఎం డీ సత్యజిత్ బ్యాంకర్లను కోరారు.
కార్యక్రమంలో యూబీఐ డీజీఎం శంకర్లాల్, డీఆర్డీవో పీడీ సంపత్రావు, డీఏవో జేడీ ఉషాదయాళ్, రీజినల్ మేనేజర్లు అలీమొద్దీన్, అశోకన్, జోషి, ఇతర బ్యాంకు అధికారులు, ఏపీఎంలు, డీపీఎంలు, ఏడీఎంసీలు, డీఎంసీలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ హరిత సమావేశ మందిరంలో పల్లెప్రగతి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బృహత్పల్లె ప్రకృతివనం స్థలం సమస్య లేని 14 మండలాల్లో వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే, జిల్లాలోని 401 డంపింగ్యార్డుల్లో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని, గ్రామ పంచాయతీల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాలను 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. నేషనల్ హైవే, ఆర్అండ్బీ రోడ్లలో జిల్లా లక్ష్యం 250 కిలోమీటర్లు కాగా.. లక్ష్యానికి తగ్గట్టుగా స్థలాలు ఎంపిక చేసి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్, డీపీవో ప్రభాకర్, జడ్పీ సీఈవో రాజారావు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.