గీసుగొండ, జూలై 28: గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని డీపీవో ప్రభాకర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఈజీఎస్ ఉద్యోగులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఉపాధిహామీ కూలీలకు నిరంతరం పనులు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో రోజూ పారిశుధ్య పనులను కొనసాగించాలని కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం కోనాయిమాకుల ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేయనున్న మెగా పార్కు స్థలాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రవీణ్కుమార్, ఏపీవో మోహన్రావు పాల్గొన్నారు.
గ్రామాల సుందరీకరణకు కృషి చేయాలి
దుగ్గొండి: గ్రామాల అభివృద్ధి, సుందరీకరణకు పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తి చేయాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని మల్లంపల్లి, మర్రిపల్లి, మహ్మదాపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సర్పంచ్లు, ఎంపీడీవో, ఎంపీవోతో కలిసి ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఇట్టబోయిన స్వామి, చుక్కా రమేశ్, తొట్ల నీలవేణి-కుమారస్వామి, ఎంపీవో శ్రీధర్గౌడ్, కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులపై కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా అభివృద్ధి నివేదికలను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు.
డంపింగ్ యార్డుల ద్వారా ఆదాయం
నల్లబెల్లి: డంపింగ్ యార్డుల ద్వారా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎంపీవో కూచన ప్రకాశ్ అన్నారు. మండలకేంద్రంలోని డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. చెత్తను వర్మీకంపోస్టు ఎరువుగా మార్చి విక్రయిస్తే జీపీలకు ఆదాయం వస్తుందన్నారు. మండలంలోని 28 జీపీల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. ఆయన వెంట కార్యదర్శి ధర్మేందర్ ఉన్నారు.