నర్సంపేట, అక్టోబర్ 19: నర్సంపేట ఆర్టీసీ డిపో చరిత్రలోనే బతుకమ్మ, దసరా పండుగలకు రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. పండుగలు ముగిసిన సందర్భంగా ప్రయాణికులను తిరుగు ప్రయాణంలో తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో నర్సంపేట ఆర్టీసీ డిపో రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదా యం మునుపెన్నడూ సమకూరలేదని అధికారులు తెలిపా రు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు సోమవారం ఒక్కరోజే రూ. 16,03,485 ఆదాయం వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ డిపో పలు రూట్లలో బస్సులు నడిపింది.
తిరుగు ప్రయాణంలో..
బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా శుక్ర, శని, ఆదివారం వరుసగా సెలవులు కావడంతో ప్రజలు సోమవారం ఒక్కసారిగా కుటుంబ సమేతంగా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన దృష్ట్యా ఎక్కువ మంది సొంత వాహనాలకంటే ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించారు. దీంతో నర్సంపేట ఆర్టీసీ అధిక ట్రిప్పులు నడిపి ఓపీటీడీ కేఎంఎస్ 43,270, ఈపీకే 37.06ను సాధించింది. ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా శ్రమించడంతో అధిక ఆదాయం సమకూరినట్లయింది.
నర్సంపేట ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి
నర్సంపేట ఆర్టీసీ చరిత్రలో ఒకేరోజు రూ. 16 లక్షలకుపైగా ఆదాయం రావడం ఇదే ప్రథమం. ఇందుకు కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, అర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు. ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నాం.