హన్మకొండ, ఏప్రిల్ 20 : కొవిడ్ బాధితులకు వైద్యం అందించడంలో వరంగల్ ఎంజీఎం దవాఖాన వైద్యుల పనితీరు అభినందనీయమని అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. కొవిడ్ చికిత్సకు సంబంధించి ఎంజీఎంలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, వైద్యుల పనితీరు, ఇంకా అదనంగా కావల్సిన వసతులపై మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో డీఎంహెచ్వో, ఎంజీఎం, కేఎంసీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ టెస్టులు చేయడంతోపాటు వైరస్ బారినపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఎంజీఎంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మరిన్ని సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు అదనపు బెడ్స్, సిబ్బందిని సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
బాధితులకు ఇస్తున్న ఆహారం, ఆక్సీజన్, శానిటైజేషన్ ప్రక్రియ, ఇంజక్షన్లు, డ్రగ్స్, టెస్ట్లు, పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి హెచ్వోడీ స్థాయిలో ఒక నోడల్ అధికారులను నియమించాలన్నారు. ఈ నోడల్ అధికారుల వద్ద ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఉండాలని సూచించారు. అలాగే, ప్రతి కొవిడ్ వార్డులో రోజూ తప్పకుండా శానిటైజేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొవిడ్ వార్డులో ప్రస్తుతం ఉన్న 440 బెడ్స్ ఆక్యుపెన్సీకి అదనంగా నాలుగు రోజుల్లో మరో 250 బెడ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులు తెలుసుకునేలా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి, 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని నియమించాలన్నారు.
హెల్ప్ డెస్క్ నెంబర్ 9490611938 ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఎంజీఎంలో కొవిడ్ చికిత్సకు సంబంధించి రోగి వివరాలు, బెడ్ ఆక్యుపెన్సీ, ఆక్సీజన్ అందుబాటు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన వివరాలను మీడియాకు రోజూ అందజేయాలని కలెక్టర్ సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్స చేస్తున్న వారియర్స్కు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీపీ పుష్ప, డీఎంహెచ్వో లలితాదేవి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ మోహన్దాస్, నోడల్ అధికారి రాజేంద్రప్రసాద్, ఆర్ఎంవోలు రమణ, సాంబరాజు పాల్గొన్నారు.