తీరనున్న మూడు మండలాల ప్రజల కష్టాలు
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి
వర్ధన్నపేట, మే 30 : ఆకేరువాగుపై బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.10.43 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం ఐబీ అధికారులతో కలిసి రాయపర్తి మండలం కొత్తూరు నుంచి వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, పర్వతగిరి మండలం రోళ్లకల్లు, కల్లెడ గ్రామాల వరకు పర్యటించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాయపర్తి నుంచి వర్ధన్నపేట మండలంలోని గ్రామాల మీదుగా పర్వతగిరి మండలంలోని గ్రామాలకు వెళ్లేలా పీఎంజీఎస్వై నుంచి 5.23 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉందన్నారు. ఆకేరువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.10.43 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఇందులో రోడ్డు నిర్మాణం కోసం రూ.4.47 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ.5.96 కోట్లు కేటాయించారని టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెప్పారు. రోడ్డు నిర్మాణంతోపాటు ఆకేరు వాగుపై వంతెన పూర్తయితే మూడు మండలాలకు చెందిన రైతులు, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు నిర్మించాలని రాయపర్తి, వర్ధన్నపేట మండలాలతో పాటు పర్వతగిరి మండలానికి చెందిన ప్రజలు, రైతులు కోరుతున్నారని దయాకర్రావు అన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడడంతోపాటు వ్యాపారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఐబీ ఏఈ సాత్విక్, కిరణ్కు ఆయన నిర్మాణ పనులను వివరించారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు వివరించారు. కాగా, మూడు మండలాలకు చెంది న రైతులు, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన మంత్రి దయాకర్రావుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.