పోచమ్మమైదాన్, మే 26 : తెలంగాణ రాష్ట్రం కోసం అక్షర సేద్యం చేసిన ప్రముఖ పద్య కవి వెలపాటి రామారెడ్డి (90) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు మిత్రమండలి ప్రతినిధులు తెలిపారు. రామారెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేశారు. అలాగే ‘తెలంగాణ సాయుధ పోరాటం’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. దీంతో పాటు ‘తెలంగాణ కావ్యం, వీర తెలంగాణ, వెలుగు నీడలు, తెలంగాణ పద్య మంజరి, కోటి గాయాల మౌనం తెలంగాణ, తెలంగాణ నడుస్తున్న చరిత్ర, నవశకం’ తదితర పుస్తకాలు పలువురి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. రామారెడ్డి రచించిన రచనలు ఏడవ తరగతి తెలుగు వాచకంలో ‘తెలంగాణ’, ఇంటర్మీడియట్ తెలుగు వాచకంలో ‘మన శిల్పారామం రామప్ప’ పేరుతో పాఠ్యాంశాలుగా ప్రచురించారు. అలాగే హైదరాబాద్ విమోచన ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకున్నారు. రామారెడ్డి మృతిపై మిత్రమండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, పొట్లపల్లి శ్రీనివాసరావు, రామా చంద్రమౌళి, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, బిల్లా మహేందర్, మాదారపు వాణిశ్రీ, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు గిరిజా మనోహర్బాబు, డాక్టర్ ఎన్వీఎన్ చారి, వనం లక్ష్మీకాంతారావు, కుందావఝుల కృష్ణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు.