చేతికొచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం
నేలరాలిన మామిడి,వరి, మక్కజొన్న, తడిసిన మిర్చి
ఇండ్లు, రోడ్లపై కూలిన చెట్లు
ఆందోళన చెందుతున్న కర్షకులు
నల్లబెల్లి/చెన్నారావుపేట, ఏప్రిల్ 22 : అకాల వర్షం ఆగం చేసింది. వడగళ్ల వాన పంటలను నేలపాలు చేసింది. బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ‘ఆరుగాలం కష్టించి పండిస్తే పంట చేతికి అందే దశలో మాయదారి వాన మమ్ములను నట్టేట ముంచింది’ అని రైతాంగం తీవ్ర ఆవేదన వ్వక్తం చేస్తున్నది. ప్రధానంగా కన్నారావుపేట, రంగాపూర్, నందిగామ, రేలకుంట, గోవిందాపూర్, నారక్కపేట, రుద్రగూడెం, బొల్లోనిపల్లి తదితర గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చిపంట తడిసి ముద్దయింది. మామిడి, వరి, మక్కజొన్న పంటలు నేలవాలాయి. చేలలోనే వరిధాన్యం రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలివాన బీభత్సానికి మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. రహదారులపై పడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నల్లబెల్లిలో సుద్దాల ఆనందం ఇంటిపై తాడిచెట్టు కూలింది. తృటిలో పెనుప్రమాదం తప్పింది.
పంటలను పరిశీలించిన ఏవో
చెన్నారావుపేట: మండల పరిధి ఈర్యా తండాలోని వరి పంటలను వ్యవసాయ అధికారి అనిల్కుమార్ గురువారం పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. రైతులు రాజు, శ్రీను, ఏఈవో స్మిత పాల్గొన్నారు.
ఖానాపురంలో నేలవాలిన పంటలు
ఖానాపురం : మండలంలో అకాల వర్షానికి పాకాల ఆయకట్టు పరిధిలోని పంటలు నేలవాలాయి. కోతదశకు చేరుకున్న పంట దెబ్బతిన్నది. మక్కజొన్న, మిరప తోటలు దెబ్బతిన్నాయి. కొత్తూరు మామిడి తోటలో కాయలన్నీ నేలరాలాయి.
దుగ్గొండిలో వడగళ్ల వాన
దుగ్గొండి: మండలంలోని గ్రామాల్లో మామిడి కాయలు రాలగా, వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. గాలిదుమారానికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కల్లాల్లోని మిర్చి తడువగా, మక్కజొన్న నేలవాలింది. రేఖంపల్లి, వెంకటాపురం, తిమ్మంపేట గ్రామాల్లో పిడుగులు పడడంతో ఇళ్లలోని గృహోపకరణాలు కాలిపోయాయి.
శాయంపేట మండలంలో..
శాయంపేట: మండల కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో చేలు, రోడ్లపై ఆరబోసిన కంకులు తడిశాయి. శాయంపేటలో చేతికొచ్చిన అరటి తోటలు నేలకూలాయి. పొట్టకొచ్చిన వరి నేలవాలింది. మక్కజొన్న చేలు పడిపోయాయి. మిర్చి తోటలకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
విరిగిపడిన తాటిచెట్టు
సంగెం: మండలంలోని ముమ్మిడివరం ట్రిపుల్కే ఫంక్షన్ హాల్ పక్కన తాటి చెట్టు గాలివానకు విరిగి వంటగదిపై పడింది. దీంతో రేకులు, పైపులు విరిగిపోయాయని బాధితుడు కలకొండ కుమారస్వామి తెలిపారు.
పంటలను పరిశీలించిన అధికారులు
నర్సంపేట రూరల్: మండలంలోని రాజుపేట, రాజపల్లి, మహేశ్వరం గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పంటలను గురువారం ఏవో కృష్ణకుమార్తో పాటు ఏఈవోలు మెండు అశోక్, భరత్ పరిశీలించారు. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఏఈవోలు నవీన్, సింధూకిరణ్మయి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
గీసుగొండ మండలంలో..
గీసుగొండ : మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పంట నేలవాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. కోనాయిమాకులలో అరటితోట నేలమట్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.