చేపలు పట్టేందుకు వెళ్లి తాత, మనవడి దుర్మరణం
చెరువులో పడి మృత్యువాత
మూడేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
మగదిక్కును కోల్పోయిన కుటుంబం
మహాముత్తారం, జూన్ 20: ఆ కుటుంబాన్ని మృ త్యువు వెంటాడింది. కొద్ది రోజుల క్రితం కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ బాధ్యతంతా తండ్రే మోస్తున్నాడు. చేపలు పట్టి అమ్ముతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లిన తాత, మనుమడు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మహాముత్తారంమండలం బోర్లగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. భీముని భూమయ్య(60), ఆయన మనుమడు భీముని రిషి(8) గ్రామ సమీపంలోని సంకరాంపాడు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. భూమయ్య రిషిని భుజాలపై ఎక్కించుకొని వల వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులో తెప్పపై వెళ్లి మృతదేహాలను వెతికి బయటకు తీసుకువచ్చారు. దీంతో వారి కుటుంబసభ్యులు బోరున విలపించడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. భూమయ్యకు, మనుమడు రిషి అంటే పంచ ప్రాణాలు. ఏ పనికి వెళ్లినా మనుమడిని వెంట తీసుకుని వెళ్లేవాడు. భూమయ్య కొడుకు( రిషి తండ్రి) రవి మూడేండ్ల కింద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భూమయ్యనే కుటుంబానికి పెద్ద దిక్కై చేపలు పట్టి అమ్మిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. తాత, మనుమడు మృతి చెందిడంతో ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయింది.