మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని ఎస్కేప్
కుదవపెట్టి లోన్ తీసుకున్న నిందితులు
వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి
హన్మకొండ సిటీ, మే18 : సీసీ ఫుటేజీల ఆధారంగా నర్సంపేట పోలీసులు ఇద్దరు చైన్స్నాచర్లను అరెస్టు చేశారు. వారికి సహకరించిన మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి చోరీ వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. గీసుగొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన రాయప్రోలు చింటు, నర్సంపేట ఇంద్రానగర్కు చెందిన దరాంగుల ప్రవీణ్ ఇద్దరు స్నేహితులు. రోజూ మద్యం తాగుతూ జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు డబ్బుల కోసం రాత్రి పూట ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసేవారు. వారి మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లి అమ్మగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసేవారు. ఈ నెల 10న రాత్రి 9 గంటల సమయంలో నర్సంపేట హనుమాన్గుడి వద్ద ఒంటరిగా వెళ్తున్న జయలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కొని పారిపోయారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి, పాకాల రోడ్డులో అదుపులోకి తీసుకొని విచారించారు. వారికి సహకరించిన నర్సంపేటకు ఆలకుంట్ల శ్రీను, అతడి పున్నెలు గ్రామానికి చెందిన బొంత కొమురయ్యను అరెస్టు చేశారు. చోరీ బంగారాన్ని ముత్తూట్లో తాకట్టుపెట్టి 70,000 లోన్ తీసుకొని పంచుకున్నట్లు వారు ఒప్పుకున్నారు. వారి నుంచి నుంచి రూ.52వేల నగదు, ముత్తూట్ నుంచి 25 గ్రాముల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ కరుణసాగర్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్, ఏఎస్సై రాజేందర్, కానిస్టేబుల్ సీతారామరాజును సీపీ అభినందించారు.