నర్సంపేట, జూన్ 14: ఆపదలో ఉన్న వారి కోసం రక్తదానం చేయాలని ఐఎంఏ నర్సంపేట అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సభ్యుడు నాడెం శాంతికుమార్ అన్నారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సోమవారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను నిలబెట్టొచ్చన్నారు. తలసేమియాతో బాధపడే వారికి, రోడ్డు ప్రమాదాల్లో గాయాలైన వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శానబోయిన రాజ్కుమార్ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా 24 సార్లు రక్తదానం చేయడమే కాకుండా గాంధీ జయంతి, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇప్పటికే 16 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారని వివరించారు. నర్సంపేటకు చెందిన ఎర్రబోయిన రాజశేఖర్ 22 సార్లు రక్తదానం చేశారన్నారు. ఈ సందర్భంగా రాజ్కుమార్, రాజశేఖర్తోపాటు పంజాల రాజు, వడ్నాల వంశీకృష్ణ, రవిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గట్టి శ్రీలత, కల్లెపెల్లి సురేశ్, బూర సుదర్శన్, తడిగొప్పుల మల్లేశ్, బేటి భాస్కర్, ఎస్కే వాసిమ్ పాల్గొన్నారు.
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
గీసుగొండ: రక్తదానం మరొకరి ప్రాణాలను నిలబెడుతుందని టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి అభిషేక్ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆయన రక్తదానం చేసి మాట్లాడారు. తాను ఇప్పటి వరకు 22 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.