జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన చీఫ్విప్ వినయ్భాస్కర్ దంపతులు
కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ
మట్టెవాడ, మే 14 : వరంగల్ మహానగరంలోని భద్రకాళీ ఆలయంలో పది రోజుల పాటు నిర్వహించనున్న భద్రకాళీ భద్రేశ్వర స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఉత్సవాంగీకార ప్రార్థన చేశారు. అమ్మవారి అనుజ్ఞ లభించిన వెంటనే బ్రహ్మోత్సవం మహాసంకల్ప పఠనం నిర్వహించి గణపతి పూజ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్-రేవతి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు వచ్చేవారని, ప్రస్తుతం కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ పాల్గొనడానికి అనుమతి లేదన్నారు. వేడుకలు నిరాడంబరంగా అర్చక సిబ్బందితో మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల ముగింపులోపు కరోనా మహమ్మారి అంతం కావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు తమ ఇళ్ల వద్దే పూజలు చేసుకోవాలని అర్చకుడు భద్రకాళీ శేషు సూచించారు. ఉత్సవ ఏర్పాట్లను ఈవో ఆర్ సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. అర్చకులకు పలు సూచనలు ఇచ్చారు. కాగా, ఉత్సవాల నిర్వహణకు చీఫ్విప్ రూ.51వేలు అందజేశారు.