ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కు అందజేత
శాయంపేట, జూన్ 13: టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్త కల్లెపు సుభాశ్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందాడు. టీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన అతడికి ఇన్సూరెన్స్ ద్వారా రూ. 2 లక్షలు మంజూరు కాగా, ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు.
కష్టకాలంలోనూ ఆగని సంక్షేమం
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. కరోనా కష్టకాలంలోనూ పథకాలను ఆపకుండా ముందుకు సాగుతున్నదన్నారు. టీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ కల్పించి అండగా నిలుస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆదర్శ పాలన అందిస్తున్నారని కొనియాడారు. అనేక పథకాలను అమలు చేస్తూ అన్ని రాష్ర్టాల చూపు మనవైపే ఉండేలా చేస్తున్నారని వివరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. ఆసరా పింఛన్లు అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహానేత కేసీఆర్ అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్బాబు, సర్పంచ్ గోలి మాధురి-మహేందర్రెడ్డి, ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, ఉప సర్పంచ్ అట్ల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.
ధాన్యాగారంగా తెలంగాణ : జడ్పీ చైర్పర్సన్
ధాన్యాగారంగా తెలంగాణ విలసిల్లుతున్నదని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, కొప్పుల, కాట్రపల్లి, నేరేడుపల్లి, శాయంపేటకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ. 3.47 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె బాధితులకు అందజేశారు. అనంతరం శాయంపేటలోని తన చాంబర్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల ధాన్యం దిగుబడులు భారీగా పెరిగి రాష్ట్రం అన్నపూర్ణగా మారిందన్నారు.
యాసంగి సీజన్లో ఒక్క శాయంపేట మండలంలోనే రెండున్నర లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం విశేషమన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదన్నారు. ఇటీవల 19 జిల్లాల్లో రెండున్నర కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా ఇప్పటికే 57 రకాల టెస్టులను రెండున్నర లక్షల మంది వినియోగించుకున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో సీఎం యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మాందారిపేట నుంచి శాయంపేట మీదుగా ప్రగతిసింగారం వరకు రూ. 8.50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచ్లు కందగట్ల రవి, అబ్బు ప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీలు వావిలాల వేణుగోపాల్, అజ్మీరా ఉమ-రఘుసింగ్, సామల మధుసూదన్, తిరుపతి, సంపత్ పాల్గొన్నారు.