కొవిడ్ బాధితులకు కొండంత అండ
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు
వేలాది మందికి ప్రాణదానం
తక్షణ స్పందన.. నిరంతర వైద్యం
నిర్విరామంగా శ్రమిస్తున్న డాక్టర్లు
ఖరీదైన మందులు ఉచితం
25 మంది వైద్యులతో కమిటీ
వేగంగా కోలుకుంటున్న బాధితులు
ఇప్పటికి 4,163 మందికి నయం
మరో 5,457 మందికి ఓపీ సేవలు
వరంగల్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా బాధితులకు సేవల విషయంలో ప్రభుత్వ దవాఖానలు సంజీవనిగా పని చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం) కరోనా రోగులకు అండగా నిలుస్తున్నది. కరోనా సోకి తీవ్ర సమస్యలు ఎదుర్కొనే వారికి అన్ని వేళలా ప్రాణదాత అవుతున్నది. వైరస్ వ్యాప్తి మొదలైన గతేడాది నుంచే ఎంజీఎం కొవిడ్ బాధితులకు అలుపెరుగని వైద్య సేవలు అందిస్తున్నది. వైరస్ రెండో దశ తీవ్రమైనప్పటి నుంచి పూర్తి స్థాయిలో కొవిడ్ నివారణకే పని చేస్తున్నది. నిపుణులైన డాక్టర్లు, అంకితభావం కలిగిన సిబ్బంది, ఆధునిక పరికరాలతో కరోనా వైద్య సేవల్లో మేటిగా నిలిచింది. ఎంజీఎంలో మొత్తం 1350 పడకలు ఉన్నాయి. వీటిలో 350 పడకలను అదనపు అవసరాల కోసం పెట్టారు. మిగిలిన 800 పడకలను పూర్తి గా కరోనా బాధితుల కోసమే వినియోగిస్తున్నారు. నగరంలో ఎక్కువ ఆక్సిజన్ పడకలు సైతం ఎంజీఎంలోనే ఉన్నాయి. మొత్తం 650 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. వెంటిలేటర్లు 80 ఉన్నాయి. రోజూ 4 వేల లీటర్ల ఆక్సిజన్ వినియోగమవుతున్నది. నిరంతరం ఆక్సిజన్ సరఫరా కోసం రెండు యూనిట్లతో ప్రత్యేక ప్లాంట్ ఉన్నది. దీని సామర్థ్యం 23 వేల లీటర్లు కాగా, 200 ఆక్సిజన్ సిలిండర్లతో కరోనా బాధితుల ప్రాణాలకు ఎంజీఎం భరోసానిస్తున్నది.
నిరంతర వైద్యసేవలు
కరోనా తీవ్రత మొదలైన గతేడాది మే నుంచి ఎంజీఎంలో వైద్యసేవలను విస్తరిస్త్తూ నిరంతరాయంగా అందిస్తున్నారు. ఎంజీఎం కొవిడ్ విభాగంలో ఇప్పటి వరకు 16 వేల మందికి పరీక్షలు చేశారు. వీరిలో 4,163 మందికి దవాఖానలో సేవలందించగా వారు కోలుకుని ధీమాగా ఇళ్లకు వెళ్లారు. కరోనా లక్షణాలు, అనుమానాలు కలిగి ఉన్న వారికి సైతం పరీక్షలు చేసి 5,457 మందికి ఔట్ పేషెంట్(ఓపీ) విభాగంలోనూ సేవలందించారు. నిపుణులైన డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు ఎంజీఎంలో వైద్య సేవలందిస్తున్నారు. ఖరీదైన పరికరాలు, వైద్య సేవల వ్యవస్థ ఎంజీంలోనే ఉన్నది. దీనికితోడు కరోనా బాధితులకు అవసరమైన ఖరీదైన మందులను ఎంజీఎంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఆక్సిజన్ సరఫరా, రెమ్డెసివిర్ మందులను అందరికీ ఉచితంగా అందుబాటులో పెట్టింది. ఇప్పటి వరకు 7,652 ఇంజక్షన్లను వినియోగించారు. వినియోగించి ప్రతి ఇంజక్షన్ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య సిబ్బందికి అన్ని వసతులనూ ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఎంజీఎంలో ప్రస్తుతం 400 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, 6800 పీపీఈ కిట్లు, 6 వేల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. గ్లౌజులు, పల్స్ ఆక్సీమీటర్లు, త్రీఫ్లై మాస్కులు, బైపాస్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం సమకూర్చుతున్న వసతులతో ఎంజీఎంలో నిరంతరం వైద్య సేవలు కొనసాగుతున్నాయి.