వీడియో కాల్ హాజరు తప్పనిసరి
ఎంపీడీవో నుంచి టీఏ వరకూ అమలు
శాయంపేట, జూన్ 12: ఉపాధిహామీ పనుల్లో దృశ్య, శ్రవణ విధానాన్ని కలెక్టర్ అమలు చేస్తున్నారు. ఎంపీడీవో నుంచి టెక్నికల్ అసిస్టెంట్ వరకూ పనులు జరిగే చోటునుంచే వీడియో కాల్కు హాజరు కావాలని నిర్దేశించారు. అక్కడ జరిగే పనులను చూడడంతో పాటు అవసరమైన వారితో నేరుగా కలెక్టర్, ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. దీనివల్ల గ్రామాల్లో పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది కూలీలు వస్తున్నారు, అధికారులు, ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారన్న విషయాలపై స్పష్టత వస్తున్నది. పనుల్లో వేగం, పారదర్శకత పెంచేందుకు కలెక్టర్ మండలాల్లో పని చేస్తున్న ఎంపీడీవో, ఈజీఎస్ ఏపీవో, ఎంపీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ల వరకూ అందరినీ బాధ్యులను చేశారు. మండల పరిధిలోని అధికారులు ప్రతి రోజూ ఉదయం ఏదో ఒక గ్రామంలో జరిగే ఉపాధిహామీ పనుల వద్దకు వీడియోకాల్ సమయానికి హాజరు కావాలి. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ ఇతర ఉన్నతాధికారులు గూగుల్మీట్ ద్వారా ఒకే సమయానికి మండలాల్లోని అధికారులకు వీడి యో కాల్ ద్వారా లైన్లోకి వస్తున్నారు. ఇలా కొద్ది రోజులుగా దీన్ని అమలు చేస్తూ అధికారులు, ఉద్యోగుల్లో బాధ్యతను పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక గ్రామంలో ఈజీఎస్ పనుల వద్ద అధికారులు ఉండి పనులు జరిపించే దృశ్యాలను లైవ్లో చూపిస్తున్నారు. సర్పంచ్, కార్యదర్శి లేదా కూలీలతోనూ వారు మాట్లాడుతూ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. రోజూ ఒక గ్రామంలో ఉపాధి పనులను పర్యవేక్షించి అక్కడి నుంచే కలెక్టర్ వీడియో కాల్కు హాజరవుతున్నట్లు ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి తెలిపారు.