చిన్నగూడూరు, జూన్ 11 : ఆమె ఓ వలసకూలి.. పైగా గర్భవతి.. పనులు లేకపోవడంతో తన వాళ్లతో కలిసి సొంతూరికి పయనమైన ఆమె వాహనంలోనే ప్రసవించింది. బీహార్ రాష్ట్రంలోని దానాపూర్ జిల్లా మంచిత్ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు మండలంలోని జయ్యారం గ్రామానికి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కూలి పనుల కోసం కొన్ని నెలల క్రితం వచ్చారు. ప్రస్తుతం వర్షాల కారణంగా పనులు మందగించడంతో శుక్రవారం తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి కోసం ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి కాజీపేటలో రైలు టికెట్లు బుకింగ్ చేయించి, బొలెరో వాహనం ఏర్పాటు చేశారు. వాహనంలో తొర్రూరు నుంచి వరంగల్రూట్లో వెళ్తుండగా దంతాలపల్లి శివారులో కూలీల్లో గర్భవతి అయిన వాణీదేవికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే తోటి మహిళలు వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేయించి నార్మల్ డెలివరీ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కొడు కు చెన్నారెడ్డి తల్లీబిడ్డలు దగ్గర్లో ఉన్న దంతాలపల్లి పీహెచ్సీకి తరలించగా అక్కడ వైద్యసిబ్బంది లేకపోవడంతో తొర్రూరుకు తీసుకెళ్లారు. అక్కడా ఎవరూ లేకపోడంతో వరంగల్లోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలుపడంతో తిరిగి వారు స్వస్థలానికి పయనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి వీడియో వాట్సాప్లో వైరల్ అయ్యింది.